టిడిపి ఎమ్మెల్యే మాధవనాయుడుపై కోర్టు ఆగ్రహం
హైదరాబాద్: ఓ న్యాయమూర్తి పట్ల అనుచితంగా ప్రవర్తించిన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం తెలుగుదేశం శాసనసభ్యుడు బండారు మాధవనాయుడుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళితే.. నిరుడు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఏర్పాట్ల గురించి నరసాపురం అదనపు జిల్లా జడ్జి అక్కడి న్యాయవాదుల సంఘం నేతలతో చర్చిస్తున్నారు.
కోర్టు భవనానికి ఆనుకుని కొందరు వ్యాపారులు శాశ్వత ప్రాతిపదికన తోపుడు బండ్లు ఏర్పాటు చేసుకోవడంతో ఏర్పడిన ఇబ్బందులను లాయర్లు జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో వాటిని తొలగించాలని జడ్జి ఆదేశించారు. కాగా, ఆ సమయంలోనే అక్కడి తన అనుచరులతో వచ్చిన ఎమ్మెల్యే మాధవనాయుడు జడ్జితో వాగ్వాదానికి దిగారు. దీనిపై జిల్లా కోర్టు వివరణ కోరింది. కాగా, ఎమ్మెల్యే కోర్టుకు క్షమాపణ కోరడంతో వివాదం సద్దుమణిగింది.

అదనపు జిల్లా జడ్జి ఈ మొత్తం వ్యవహారాన్ని హైకోర్టుకు నివేదించారు. దీని ఆధారంగా రూపొందించిన కోర్టు ధిక్కరణ కేసును ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పివి సంజయ్ కుమార్ లతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది.
ఇటువంటి కేసులో క్షమించే పరిధి కింది కోర్టుకు లేదని స్పష్టం చేసింది. ఎమ్మెల్యే చర్యలను న్యాయవ్యవస్థపై దాడిగానే భావించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. కౌంటర్ దాఖలు చేయాలని ఎమ్మెల్యే మాధవనాయుడును కోర్టు ఆదేశించింది.












Click it and Unblock the Notifications