నాపై తప్పుడు పోస్టులు పెడుతున్నారు: డీజీపీ కార్యాలయంలో యామిని సాధినేని ఫిర్యాదు
తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సాధినేని యామిని ఏపీ డీజీపీ ఆఫీసుకు వెళ్లి ఫిర్యాదు చేశారు. తనను కొందరు లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వేదికగా తన పేరిట తప్పుడు ఖాతాలు సృష్టించి పిచ్చి పోస్టింగులు పెడుతున్నారని ఆమె ఫిర్యాదు చేసింది. ఉమెన్ ప్రొటెక్షన్ ఎస్పీ సరితకు ఆమె ఫిర్యాదు చేశారు. అంతేకాదు ఎక్కడెక్కడి నుంచో తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పిన యామిని... తనతో అసభ్యకరంగా మాట్లాడటమే కాకుండా తన కుటుంబ సభ్యులను కూడా టార్గెట్ చేసి బెదిరిస్తున్నారని ఆమె తన కంప్లయింట్లో పేర్కొన్నారు.
తన ఫేస్బుక్ అధికారిక అకౌంట్ సాధినేని యామినీ శర్మ పేరుతో ఉంటుందని... ఇక యామిని సాధినేని, యామిని సాధినేని యువసేన లాంటి తప్పుడు అకౌంట్లు సృష్టించి చాలా అసభ్యకరమైన కామెంట్స్ పోస్టు చేస్తున్నారని ఆమె ఫిర్యాదు చేసింది. అంతేకాదు తాను ప్రధాని మోడీని, సీఎం జగన్ను ఏదో తిట్టానని చెబుతూ చాలా జుగుప్సాకరమైన పోస్టులు పెడుతున్నారని సాధినేని యామిని ఆవేదన వ్యక్తం చేసింది. తనపై ఏదో కుట్ర జరుగుతోందన్న అనుమానం కలుగుతోందని యామిని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇక కొందరు కేటుగాళ్లు చేసే ఈ పనివల్ల తను చాలా ఇబ్బందికి గురవుతున్నట్లు తెలిపారు. మరోవైపు తన పేరుతో ఫేక్ పోస్టింగులు పెట్టడం వల్ల చాలామంది తానే ఈ వ్యాఖ్యలు చేశానని భావించి ట్రోలింగ్ చేస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన పేరుతో ఉన్న తప్పుడు అకౌంట్లను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.మహిళలపై అనవసరంగా తప్పుడు పోస్టులు పెట్టి వారిని ఇబ్బందులకు గురిచేసే వారిపై సీఎం జగన్ కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ మేరకు సైబర్ చట్టాన్ని మరింత కఠినతరం చేయాలని ఆమె కోరారు.
ఇదిలా ఉంటే కొందరు అజ్ఞాత వ్యక్తులు తనకు ఫోన్ చేసి చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు. దేశ విదేశాల్లో తనకు మంచి పేరుందని..తన పేరు ప్రఖ్యాతలకు నష్టం వాటిల్లేలా కొందరు ప్రవర్తిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. తనను రాజకీయంగా దెబ్బ తీయాలనే కుట్రను తాను సమర్థవంతంగా ఎదుర్కోగలనని యామిని అన్నారు. మానసికంగా తనను దెబ్బతీసి రాజకీయాలకు దూరం చేయాలని కొందరు చేస్తున్న కుట్రలు సాగవని ఆమె అన్నారు. ఇలాంటి వాటికి భయపడేదే లేదని చెప్పిన యామిని..ఇంతకు ముందు కూడా ఇదే తరహాలో ట్రోల్ చేశారని ఆమె గుర్తు చేశారు. ఇప్పటికే దీనిపై టీడీపీ అధ్యక్షుకు చంద్రబాబుకు చెప్పినట్లు ఆమె తెలిపారు.