జగన్ హస్తం, వేయి మందిని పంపించి చేయించారు: తుని హింసపై యనమల
విజయవాడ: తూర్పు గోదావరి జిల్లా తుని హింసకు ఆంధ్రప్రదేశ్ మంత్రులు, తెలుగుదేశం పార్టీ నాయకులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని నిందిస్తున్నారు. తుని సంఘటనల వెనక జగన్ హస్తం ఉందని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.
తుని సభకు జగన్ వేయి మందిని తన అనుచరులను పంపించి ఉద్రిక్తతకు తెరలేపారని ఆయన ఆరోపించారు. గతంలో కాపు ఉద్యమాలు శాంతియుతంగా జరిగాయని ఆయన అన్నారు. ప్రభుత్వం అన్నీ గమనిస్తోందని ఆయన అన్నారు. తగిన సమయంలో అన్ని బయటకు వస్తాయని ఆయన అన్నారు. వైయస్ జగన్ వెనక ఉండి కథ నడిపారని ఆయన అన్నారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండడం ఇష్టంలేకనే జగన్ ఆ పని చేయించారని ఆయన అన్నారు.
కాపు గర్జనలోకి సంఘ విద్రోహ శక్తులను ప్రవేశపెట్టారని మంత్రి నారాయణ ఆరోపించారు. తల్లి, పిల్ల కాంగ్రెసు పార్టీల రాక్షస రాజకీయ కుట్రలో భాగంగానే తుని హింస చెలరేగిందని ఆయన అన్నారు. జాతీయ స్థాయిలో కాపుల ప్రతిష్టను దిగజార్చేందుకు ఈ ప్రయత్నం జరిగిందని ఆయన అన్నారు. తుని సంఘటనలు దురదృష్టకరమని అన్నారు.
కాపు గర్జనలో వైసిపి కుట్ర ఉందని హోం మంత్రి చిన రాజప్ప అన్నారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఆయన కాపులకు విజ్ఞప్తి చేశారు. కాపుల కోసం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను సహించలేకనే తుని సంఘటనలకు పాల్పడ్డారని ఆయన అన్నారు. కాపు ఐక్య గర్జనకు ప్రభుత్వం ఏ విధమైన ఆటంకాలు కూడా కల్పించలేదని అన్నారు.
ముద్రగడతో ప్రభుత్వం చర్చలు జరిపితే సమస్య పరిష్కారమవుతుందని తెలుగుదేశం పార్టీ నాయకుడు జూపూడి ప్రభాకర రావు అన్నారు. తుని సంఘటనలు టిడిపి జరుగుతున్న రాజకీయ కుట్రలో భాగమని ఆయన అన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలోనే కాపులకు అధిక ప్రాధాన్యం లభించిందని ఆయన అన్నారు.
తుని ఘటన వెనక వైసిపి కుట్ర ఉందని టిడిపి ఎపి అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. జగన్ సంఘ విద్రోహ శక్తులను రెచ్చగొట్టారని ఆయన ఆరోపించారు. కాపులు శాంతియుతంగా డిమాండ్లను పరిష్కరించుకోవాలని మంత్రి మృణాళిని అన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసి కాపులకు చెడ్డపేరు తేవోద్దని ఆమె అన్నారు.
రాజకీయ నిరుద్యోగులే తుని సంఘటనలకు పాల్పడ్డారని ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి అన్నారు. తుని సంఘటనలపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు.