రాజ్యసభకు నిర్మల: యనమలకు గవర్నర్ పదవి?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడుకు గవర్నర్ పదవి లభించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. పార్టీ అధినేత చంద్రబాబు ఇటీవల తన ఢిల్లీ పర్యటనలో కొందరు పార్లమెంటు సభ్యుల వద్ద ఈ విషయం ప్రస్తావించినట్లు తెలుస్తోంది. టిడిపిలో ఆయన సుదీర్ఘ కాలంగా పనిచేశారు. అసెంబ్లీ స్పీకర్, ఆర్థికమంత్రిగా ఆయన పనిచేశారు.
ప్రస్తుతం శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆయనకున్న సుదీర్ఘ అనుభవం దృష్ట్యా గవర్నర్గా ఎంపిక చేస్తే బాగుంటుందని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు. కేంద్రంలో వచ్చిన మూడు కాంగ్రెసేతర ప్రభుత్వాల్లో క్రియాశీలక పాత్ర పోషించినా, ఎప్పుడూ గవర్నర్ పదవిని టిడిపి తీసుకోలేదు. ఈసారి ప్రధాని మోడీని అడిగి ఆ పదవి తీసుకోవాలనే ఆలోచనలో టిడిపి ఉన్నట్లు చెబుతున్నారు.

యనమల ఈసారి ఉప ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నారు. ఆయనతో పాటు అదే పదవికి ప్రచారంలోనున్న నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ ఎమ్మెల్సీగానే ఎన్నిక కావాల్సి ఉంది. ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఎమ్మెల్సీ కోటా నుంచి రావడం బాగుండదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. దీంతో యనమల గౌరవం తగ్గకుండా చూసేందుకే ఆయనను గవర్నర్గా పంపాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ సీటు బిజెపికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. నేదురుమల్లి జనార్దనరెడ్డి మరణంతో ఖాళీ అయిన సీటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించడం తెలిసిందే. శాసనసభలో సంఖ్యా బలాన్ని బట్టి టిడిపి గెలుచుకునే అవకాశం ఉంది. ఆ సీటు తమకు కావాలని బిజెపి అధినాయకత్వం చంద్రబాబును కోరింది.
కేంద్ర మంత్రివర్గంలోకి కొత్తగా తీసుకున్న నిర్మలా సీతారామన్ను రాజ్యసభకు పంపే నిమిత్తం బిజెపి ఈ సీటును కోరింది. దానిని ఇవ్వడానికి చంద్రబాబు అంగీకరించారు. బిజెపి ప్రభుత్వంతో సత్సంబంధాలు కోరుకుంటున్న ఆయన, అందులో భాగంగా ఈ సీటును అడగ్గానే ఇచ్చేశారు.












Click it and Unblock the Notifications