రైలు వెళ్లాక రెడ్లైట్, జగన్కు మద్దతే: కిరణ్పై యనమల
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రైలు వెళ్లిపోయాక ఎర్ర లైటు వెలిగినట్లుగా విభజన నిర్ణయంపై వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ శాసన మండలి పక్ష నేత యనమల రామకృష్ణుడు సోమవారం ఎద్దేవా చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు సమైక్యం ముసుగులో విభజనకు పరోక్షంగా సహకరిస్తున్నారని ఆరోపించారు.
సమైక్యంపై ముఖ్యమంత్రికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. అదే ఉంటే సిడబ్ల్యూసి ప్రకటన రోజునే ముఖ్యమంత్రి పదవికి, పార్టీకి రాజీనామా చేసే వారన్నారు. విభజనపై అప్పుడు ఢిల్లీ పెద్దల మాటలకు తల ఊపి ఇప్పుడు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గేమ్ ప్లాన్లో భాగంగానే కిరణ్, జగన్లు మాట్లాడుతున్నారన్నారు.
సమైక్యంపై కిరణ్ చిత్తశుద్ధిని ప్రజలు నిలదీస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ అవినీతి ప్రమాదకరం కాదన్న కిరణ్ వ్యాఖ్యలు పరోక్షంగా జగన్ను సమర్థిస్తున్నట్లుగానే ఉన్నాయన్నారు. వారిద్దరిది సమైక్యవాదం కాదని సోనియావాదమని మండిపడ్డారు.
టిడిపి వర్సెస్ కాంగ్రెసు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కలెక్టరేట్ వద్ద ఐఏబి సమావేశాన్ని తెలుగుదేశం పార్టీ అడ్డుకునే ప్రయత్నాలు చేసింది. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి టిడిపి నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వినతి పత్రం ఇచ్చే ప్రయత్నం చేశారు. సభలో వినతి పత్రం వద్దని ఆనం చెప్పారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.