మూడో రోజుకు భాగస్వామ్య సదస్సు: 'అభివృద్ధిలో చైనా మనకు స్ఫూర్తి'
అమరావతి: విశాఖపట్నంలో నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సు మూడో రోజు ప్రారంభమైంది. మూడో రోజు జరుగుతున్న భాగస్వామ్య సదస్సుకు ఏపీ ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధిలో చైనా మనకు స్ఫూర్తి అని అన్నారు.
యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ భాగస్వామ్య సదస్సు ద్వారా నైపుణ్యాభివృద్ధికి పారిశ్రామికవేత్తలు తోడ్పాటు అందించాలని మంత్రి యనమల కోరారు.
విశాఖలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న మూడు రోజుల భాగస్వామ్య సదస్సుకు తొలి రెండు రోజులు ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు వెల్లువెత్తాయి. భారీ పరిశ్రమలు, ఆహార ప్రాసెసింగ్, మైనింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంధన, తయారీ, రిటైల్, సీఆర్డీఏ, గృహ నిర్మాణ, మౌలిక రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పలు జాతీయ, అంతర్జాతీయ సంస్ధలు ముందుకొచ్చాయి.
రెండు రోజుల్లో మొత్తంగా రూ. 3.89 లక్షల కోట్ల పెట్టుబడులకు పలు సంస్థలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంవోయు కుదుర్చుకున్నాయి. భాగస్వామ్య సదస్సు రెండో రోజైన సోమవారం ఒక్కరోజే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 281 పెట్టుబడుల ఒప్పందాలను కుదుర్చుకుంది. దీని విలువ మొత్తం రూ.1,92,571 కోట్లు.
ఈ ఒప్పందాలతో ఏపీలో కొత్తగా 6,53,933ఉద్యోగాలు రానున్నాయి. భాగస్వామ్య సదస్సు రెండు రోజుల్లో మొత్తం ఒప్పందాల సంఖ్య 313కు, పెట్టుబడుల మొత్తం రూ.3.89 లక్షల కోట్లకు పెరిగింది. అమరావతిలో మౌలిక సదుపాయాల ప్రణాళిక, గృహ నిర్మాణం కోసం చైనా కంపెనీలు ముందుకొచ్చాయి.
కాగా భాగస్వామ్య సదస్సులో చివరిరోజైన మూడోరోజు గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తదితరులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు.