హోదాXరాజధాని: వైసిపి ఆందోళనలు, కలుస్తానని మోడీకి జగన్ లేఖ!, పిలుస్తాం: యనమల
గుంటూరు: ఓ వైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 22వ తేదీన రాజధాని అమరావతి శంకుస్థాపనకు సిద్ధమవుతుంటే.. ప్రతిపక్షం ఈ నెల 17వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ప్రత్యేక హోదా కోసం ఆందోళనలకు సిద్ధమవుతోంది.
గుంటూరు జిజిహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అధినేత జగన్ను కలిశారు. ఈ సందర్భంగా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించారు. విజయ సాయి రెడ్డి, బొత్స సత్యనారాయణ, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి తదితరులు అధినేతను కలిశారు.
ఈ సందర్భంగా ప్రత్యేక హోదా కోసం ఏం చేయాలో చర్చించారు. అనంతరం నిర్ణయానికి వచ్చారు. 17-21 వరకు హోదా కోసం ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించారు. రేపు (బుధవారం) సిడబ్ల్యూసి మైదానం నుంచి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం వరకు ర్యాలీ తీయనున్నారు.

17న నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలు, 18న రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, 19వ తేదీన నియోజకవర్గ కేంద్రాల్లో, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నాలు, 20వ తేదీన జిల్లా కేంద్రాల్లో కొవ్వొత్తుల ర్యాలీ, 21వ తేదీన ఆర్టీసీ డిపోల ముందు ఆందోళన. అనంతరం ప్రధాని మోడీ అపాయింటుమెంట్ కోరుతూ జగన్ లేఖ రాయనున్నారు. ప్రభుత్వం ఈ నెల 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రాజధాని శంకుస్థాపన వేడుకలను నిర్వహిస్తోంది.
కెసిఆర్, జగన్లను పిలుస్తాం: యనమల
రాజధాని అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానిస్తామని మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం నాడు చెప్పారు. అమరావతి వేడుకలో పార్టీలకు అతీతంగా అందరు పాల్గొనాలన్నారు.












Click it and Unblock the Notifications