సలహాదారులు లేకే: జగన్పై గంటా, 21ఎకరాల్లో 60గదుల మాటేమిటి: యనమల
గుంటూరు: తనకు రాజధాని అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానం పంపించవద్దన్న వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావు శుక్రవారం నాడు కౌంటర్ ఇచ్చారు. దురదృష్టవశాత్తూ జగన్కు ఆర్థిక సలహాదారులే తప్ప, రాజకీయ సలహాదారులు లేన్నారు.
అందుకే ఇలాంటి విపరీత నిర్ణయాలను జగన్ తీసుకుంటున్నారన్నారు. తనకు ఆహ్వానం పంపించవద్దని జగన్ చెప్పడం విడ్డూరమన్నారు. పంపించడం తమ బాధ్యత అన్నారు. జగన్ తన లేఖలో పలు సందేహాలు వ్యక్తం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.
జగన్ తీరుతో అందరూ నవ్వుకుంటున్నారని చెప్పారు. ఇంత అవివేక నాయకుడు ప్రతిపక్ష నేతగా ఉండటం దారుణమన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా అందరూ రాజధాని శంకుస్థాపన వేడుకలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారన్నారు. జగన్ రానని చెప్పడం విడ్డూరమన్నారు.
బెంగళూరులో 21 ఎకరాల్లో 60 గదుల ప్యాలెస్: యనమల
ఒక వ్యక్తికి 21 ఎకరాల్లో 60 గదుల ప్యాలెస్ ఉండొచ్చు కానీ ఏపీ ప్రజలకు రాజధాని కోసం 33వేల ఎకరాలు ఉంటే తప్పేమిటని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు జగన్ పైన మండిపడ్డారు. జగన్కు 21 ఎకరాల్లో 60 గదుల ప్యాలెస్ కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉండవచ్చా అన్నారు.
శుక్రవారం యనమల మీడియాతో మాట్లాడారు. జగన్ స్వగ్రామం పులివెందులకు నాలుగు లేన్ల రోడ్డు ఎందుకన్నారు. జగన్ వద్దన్నా తాము అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానం పంపుతామని చెప్పారు.
ఆహ్వానం పంపితే వద్దనేవారు ప్రపంచంలో ఎవరూ ఉండబోరన్నారు. అమరావతి శంకుస్థాపనకు రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారని అనడం ప్రతిపక్షాల అవగాహనారాహిత్యమన్నారు. శంకుస్థాపన ఏర్పాట్లను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వలేదని, జిల్లా కలెక్టర్ చూస్తున్నారన్నారు.