నా మాటే శాసనం... నేను మారలేదు?
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చి వైఎస్సార్ పేరు పెట్టడం తనకు ఇష్టం లేదని, అందుకే పదవులకు రాజీనామా చేశానని మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజీనామాపై తన స్వరం మారినట్లు వచ్చిన వార్తలను కొట్టిపారేశారు. తాను వెనకడుగు వేయలేదని స్పష్టం చేశారు. పదవులు లేకపోయినా భాషాభివృద్ధి కోసం కృషి చేస్తానని, ఎన్టీఆర్తో తనకున్న అనుబంధం కారణంగానే పేరు మార్పు ఇష్టం లేక రాజీనామా చేసినట్లు వెల్లడించారు.
ముఖ్యమంత్రి కార్యాలయానికి, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్కు మెయిల్ ద్వారా రాజీనామా లేఖలు పంపించినట్లు యార్లగడ్డ తెలిపారు. పదవి నుంచి వైదొలుగుతున్నానని మా సిబ్బందిని పిలిచి చెప్పానని, నాకు ఇప్పటి వరకు ప్రభుత్వంలో వేతనం వస్తోంది కాబట్టీ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా నా పింఛను వద్దని చెప్పానన్నారు. ఈ పదవి తీసుకున్నప్పుడు యూనివర్సిటీకి లేఖ రాశానని, ఈనెల నుంచి నేను పదవిలో లేను కాబట్టీ పింఛను పునరుద్ధరించాలని అధికారికంగా మళ్లీ విశ్వవిద్యాలయానికి లేఖ రాసినట్లు లక్ష్మీప్రసాద్ గత సంఘటనలను వివరించారు. స్వరం మార్చిన యార్లగడ్డ అని మీడియాలో వార్త వచ్చిందని, తన స్వరం మారలేదని, తాను మారనని, రాజీనామాపై వెనకడుగు వేసే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. రాజకీయాలు కూడా మాట్లాడనని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో మాదిరిగానే తెలుగు భాష అభివృద్ధి కోసం పనిచేస్తూనే ఉంటానన్నారు.
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి పేరు మార్చి వైఎస్సార్ పేరు పెట్టింది. దీనిపై అన్నివైపుల నుంచి విమర్శలు వ్యక్తమైనప్పటికీ ముఖ్యమంత్రి జగన్ వెనకడుగు వేయలేదు. ఈ చర్యను నిరసిస్తూ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి రాజీనామా సమర్పించారు.