మంత్రి పదవి దక్కలేదు: ఎమ్మెల్యే పిన్నెల్లికి మద్దతుగా రాస్తారోకోలు, కంటతడి పెట్టిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ కొంతమందిలో ఆనందం నింపితే.. మరికొంతమందికి నిరాశను గురిచేసింది. తమకు మంత్రివర్గంలో చోటు కల్పించనందుకు పలువురు ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. వారి అనుచరులు, అభిమానులు ఆందోళనలకు దిగారు. తమ నేతకు మంత్రివర్గంలో చోటు కల్పించలేదంటూ రోడ్లపై రాస్తారోకోలు నిర్వహించారు. మరికొంత మంది నేతలు మాత్రం మంత్రి పదవి రాలేదని బాధ ఉన్నప్పటికీ.. సీఎం జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వ్యాఖ్యానించారు.
పిన్నెల్లికి మంత్రివర్గంలో చోటు దక్కలేదని నిరసన
ఏపీ మంత్రివర్గ విస్తరణలో కొంతమంది పాత మంత్రులను కొనసాగించినప్పటికీ.. ఎక్కువ మందిని కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. సీనియర్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడంతో ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా.. పిన్నెల్లికి మంత్రివర్గంలో చోటు లభించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మాచర్ల, వెల్దుర్తి, కారంపూడి, దుర్గి, రెంటచింతల మండలాల పరిధిలో వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
ఇంటికే పరిమితమైన ఎమ్మెల్యే పిన్నెల్లి
మండల కేంద్రమైన రెంటచింతలలో ప్రధాన రహదారిపై అనుచరులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్లపై టైర్లు తగలబెట్టారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాచర్ల నియోజకవర్గ మహిళా నాయకురాలు పాముల సంపూర్ణమ్మ మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా, వైసీపీ నేతలు ఆమెను అడ్డుకున్నారు. మరోవైపు, మంత్రి పదవి లభించకపోవడంతో కొంత నిరాశకు గురైన పిన్నెల్లి ఇంటికే పరిమితమయ్యారు. ఎవరినీ కలిసేందుకు కూడా ఇష్టపడలేదు. సీఎంవో నుంచి ఫోన్ వచ్చినా మాట్లాడేందుకు అంత ఆసక్తి చూపలేదని తెలిసింది.
కంటతడి పెట్టిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
ఇది ఇలావుండగా, తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొంత నిరాశకు గురయ్యారు. నెల్లూరు రూరల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు. పార్టీ కోసం మొదట్నుంచి పనిచేస్తున్నా.. మంత్రి పదవి రాకపోవడం బాధ కలిగించిందన్నారు. మంత్రి పదవి రాలేదని బాధ ఉన్నా.. పార్టీని వీడనన్నారు. రాజీనామాలకు సిద్ధమైన వైసీపీ నేతలు, కార్పొరేటర్లకు కోటంరెడ్డి నచ్చజెప్పారు. ఎవరూ రాజీనామా చేయవద్దని సూచించారు. కార్యకర్తలు, నాయకులు వారి రక్తం చెమటగా మార్చి తన కోసం కష్టపడి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని భావోద్వేగానికి గురయ్యారు. మరోవైపు, మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై మేకతోటి సుచరిత అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన నిర్వహించారు.