పరుగు పందెంలో టీడిపి కంటే వెనకబడి పోతున్న వైసీపి..!
హైదరాబాద్: ఏపీలో అదికార ప్రతిపక్ష పార్టీల మద్య ఎప్పుడు అప్రకటిత పోటీ నెలకొని ఉంటుంది. ప్రజాసమస్యల పరిష్కారంలో రెండు పార్టీలు నిరంతరం యుద్ద వాతావరణాన్ని తలపిస్తుంటాయి. ప్రజా క్షేత్రంలో నువ్వా నేనా అన్నట్టుగా హీట్ పెంచేస్తాయి ఈ రెండు పార్టీలు. కాని ఇటీవల పరిణామలు పరిశీలిస్తే తలుగుదేశం పార్టీతో పోటీ పడలేక వైయస్ఆర్సీపి వెనకబడి పోయినట్టు తెలుస్తోంది. ఏపీ వ్యాప్తంగా ప్రజా పోరాట దీక్షలతో తెలుగుదేశం పార్టీ బహిరంగ సభలు నిర్వహించుకుంటుంటే., వైసీపి మాత్రం ఒకే ఒక్క సారి వంచన పోరాట సభ జరిపి చేతులు దులుపుకుంది. బహిరంగ సభలు నిర్వహించుకోక పోవడానికి పార్టీ అదినేత పాదయాత్రే శరాఘాతంలా పరిణమించిందని వైసీపి నేతలు చెప్పుకొస్తున్నారు.
టీడిపి, వైసీపి రెండు పార్టీల లక్ష్యం రాబోవు ఎన్నికలే..! కాని రేసులో వెనకబడిపోతున్న వైసీపి..!
తెలంగాణ రాజకీయాలు ముందస్తు దిశగా వడివడిగా అడుగులు వేస్తుండగా, ఏపీ రాజకీయాలు ఇందుకు కాస్త భిన్నంగా ఉన్నాయి. ఏపీకి బీజేపీ అన్యాయం చేసిందని ఆరోపిస్తూ టీడిపి ఆ పార్టీని టార్గెట్ చేస్తోంది. అలాగే బీజేపీ, వైసీపీ కలిసిపోయాయని టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి టీడీపీని లక్ష్యంగా చేసుకుని ప్రత్యారోపణలు చేస్తున్నారు. అయితే పార్టీపరంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించుకునే విషయంలో వైసీపీ నేతలు వెనుకబడివున్నారని తెలుస్తోంది.
జగన్ పాదయాత్రే శరాఘాతం..! యాత్రల తర్వాతే సమావేశం..!
పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఉండటంతో వైసీపీ నేతలు అడపాదడపా జిల్లాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ విషయంలో వైసీపీ నేతలు మరో రకమైన వాదన కూడా ఉందంటున్నారు. వైసీపీలో జగన్మోహన్ రెడ్డిని మినహాయిస్తే ఆ పార్టీలో ఆకర్షణ ఉన్న నేతల సంఖ్య తక్కువగా ఉన్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే పెద్ద ఎత్తున సభ నిర్వహించాలని భావిస్తున్న నాయకులు పాదయాత్రలో ఉన్న జగన్ తమ సమావేశాలకు రారనే ఉద్దేశంతో ఉన్నారట. ఈ కారణంగానే చాలామంది నాయకులు జిల్లా స్థాయిలో భారీ ఎత్తున సభలు ఏర్పాటు చేసేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. మరోవైపు వైసీపీ పెద్దలు సైతం జగన్ లేకుండా ఎలాంటి భారీ సమావేశాలు నిర్వహించకూడదని జిల్లా స్థాయి నేతలకు సూచించినట్టు తెలుస్తోంది.
చరిష్మా ఉన్న ఏకైక నేత జగన్..! ఆయన వస్తేనే మీటింగ్ లు సక్సెస్..!
దీంతో నియోజకవర్గ స్థాయి నాయకులు తమ ప్రాంతాల్లో పార్టీ తరపున పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఫలితంగా తమ ప్రాంతాల్లో భారీ సభలు ఏర్పాటు చేయాలనుకుంటున్న నేతలు తమ ప్రతిపాదనను వాయిదా వేసుకుంటున్నారని సమాచారం. వైసీపీలో జగన్ తరహాలో మరో జనాకర్షణ కలిగిన నాయకుడు లేకపోవడం కూడా ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఎన్నికల హడావిడి మొదలైన తరువాత సభలు ఏర్పాటు చేసే ఆలోచనలో మరికొందరు నేతలు ఉన్నారని తెలుస్తోంది. అయితే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పూర్తయిన అనంతరం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మరోసారి భారీ బహిరంగ సభలు ఉంటాయని ముఖ్యనేతలు చెప్పుకొస్తుట్టు సమాచారం.
పాదయాత్ర తర్వాతే కలుసుకుందాం..! అప్పటివరకూ నో మీటింగ్స్..!
ఎన్నికల కోసం ఏర్పాటు చేసే సభల్లో ఎలాగూ జగన్ పాల్గొంటారు కాబట్టి అప్పుడు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంలో చాలామంది నియోజకవర్గ స్థాయి నాయకులు ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు తమకు ఎన్నికల్లో టికెట్ ఖరారు కాకముందే పార్టీ కోసం భారీ ఎత్తున ఖర్చు చేయడం ఎందుకనే ఉద్దేశంలోనూ చాలామంది నాయకులు ఉన్నారనే చర్చ నడుస్తోంది. అయితే పేరున్న కొందరు నేతలు మాత్రం విజయసాయిరెడ్డి, రోజా వంటి నాయకులను తీసుకొచ్చి తమ ప్రాంతాల్లో సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారని తెలుస్తోంది. జగన్ పాదయాత్ర పూర్తయిన తరువాతే ఏపీలో వైసీపీ తరపున బహిరంగ సభలు ఊపందుకుంటాయని తెలుస్తోంది.