ఈ నెల 7న పోలవరానికి వైసిపి బస్సుయాత్ర
అమరావతి: డిసెంబర్ 7 వ తేదీన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. వైసిపికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు బస్సు యాత్ర ద్వారా పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శనకు బయలుదేరి వెళ్లనున్నారు.
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రం నుంచి ఎపి ప్రభుత్వానికి అక్షింతల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన వైసిపి ఈ యాత్ర చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రాజెక్టు సందర్శనకు డిసెంబర్ 7 న అమరావతిలోని వైసిపి పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఉదయం 9 గంటలకు వైకాపా నాయకులతో బస్సులు బయలుదేరనున్నాయి. మీడియాకు ప్రత్యేకంగా మరో బస్సు ఏర్పాటు చేయటం జరిగింది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక పథకం ప్రకారం చేతులెత్తేస్తూ దానికి శాశ్వతంగా సమాధికట్టేలా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ దుర్మార్గ వైఖరిని ప్రజల కళ్లకు కట్టినట్టు వివరించటానికి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్ళేలా ఒత్తిడి చేయటానికి తాము ఈ బస్సు యాత్ర చేపట్టినట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. మరోవైపు రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమ సోమవారం పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించనున్నారు.