పవన్ ఇలా దొరికేశాడేంటి..? పోతిరెడ్డిపాడు వ్యతిరేకించిన వారితో మంతనాలా..? వైరల్ అవుతున్న పోస్టింగులు
అమరావతి: జనసేనాని పవన్ కళ్యాణ్ పై వైసీపీ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. తెలంగాణ బీజేపీ నూతనాధ్యక్షుడు బండి సంజయ్తో సమావేశం అవడం ఆ తర్వాత పోతిరెడ్డిపాడుకు అనుకూలంగా పవన్ కళ్యాణ్ ఒక్క వ్యాఖ్య కూడా చేయకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ జనవరిలో ఏపీలో కలిసి పనిచేసేందుకు బీజేపీ-జనసేన ముందుకొచ్చాయి. పొత్తు కుదుర్చుకున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసి పోరాటం చేయాలని నిర్ణయించాయి. కానీ ఏ విషయంలోనూ కలిసి పోరాటం చేసే అవకాశం లభించలేదు. కరోనా కారణంగా క్షేత్రస్థాయి పోరాటాలకు అవకాశం లేకుండా పోయింది.

పోతిరెడ్డిపాడు విషయంను వ్యతిరేకించిన బండి సంజయ్
జగన్ ప్రభుత్వం విద్యుత్ ధరలు పెంచడం తాజాగా టీటీడీ భూవివాదాల విషయంలోనూ బీజేపీ నేతలు తమ ఇళ్ల వద్దే నిరసన దీక్షలు చేశారు. అయితే జనసేన నేతలను మాత్రం కలుపుకుపోలేదు. కొన్ని ప్రాంతాల్లోని జనసేన కార్యకర్తలు అక్కడక్కడ నిరసన దీక్షలు చేశారు. పవన్ కళ్యాణ్ కేవలం ట్విటర్ ద్వారానే విమర్శలు చేస్తూ వస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జనసేన అధినేత పవన్తో భేటీ అయ్యారు. తెలంగాణలోనూ రెండు పార్టీలు కలిసి పనిచేసే అంశంపైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే బండి సంజయ్ ఏపీ ప్రభుత్వం తీసుకున్న పోతిరెడ్డి పాడు నిర్ణయంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు.

సంజయ్ విమర్శలపై పవన్ ఎందుకు ప్రశ్నించలేదు..?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రి జగన్తో ఇంకా సఖ్యత ఉందనే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే ఆ వివాదం సమయంలోనూ పవన్ కళ్యాణ్ తటస్థంగా ఉండిపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఆ వివాదంలో మౌనంగా ఉండాలని పార్టీ నేతలను ఆదేశించారు. దీంతో అటు జగన్ ఇటు కేసీఆర్ తమ ప్రాంతాలకు అనుగుణంగా వాదనలు వినిపిస్తూ రాజకీయంగా బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రయోజనాల కోసం వ్యతిరేకంగా మాట్లాడిన బండి సంజయ్తో పవన్ భేటీ అవడం, కలిసి పనిచేసేందుకు చర్చించారనే ప్రచారంపైన వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఏపీ బీజేపీ నేతలే పోతిరెడ్డిపాడుపై ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తున్న వేళ బండి సంజయ్తో కలవటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పోతిరెడ్డిపాడు విషయంలో సంజయ్ చేసిన విమర్శలపై పవన్ ఎందుకు స్పందించడం లేదని నిలదీస్తున్నారు.
Recommended Video

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పోస్టులు
తాజాగా బండి సంజయ్ తెలంగాణలో కేసీఆర్ ముస్లిం రాజ్యాన్ని ఏపీలో జగన్ క్రైస్తవ రాజ్యాన్ని స్థాపించేందుకు ప్రయత్నిస్తున్నారన్న కామెంట్స్ పైనా వైసీపీ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. తను మత రాజకీయాలకు వ్యతిరేకమని పదే పదే చెప్పిన పవన్ బండి సంజయ్తో సుదీర్ఘభేటీ కారణంగా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏపీలో జనసేనతో మిత్రపక్షంగా ఉన్న బీజేపీయే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ముఖ్యమంత్రిని సమర్థిస్తుంటే అదే పార్టీకి చెందిన పొరుగు రాష్ట్ర నేతలతో పవన్ చెట్టాపట్టాల్ వేసుకోవడం ఇప్పుడు వివాదానికి కారణమైంది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ పోస్టులపైన జనసేన పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications