క్యాంప్ పాలిటిక్స్:రాజ్యసభ సీటు కోసం...ఎమ్మెల్యేలు ఢిల్లీ నుంచి విదేశాలకే...
అమరావతి: ఏపీలో రాజ్యసభ ఎన్నికల హడావుడి ఊపందుకుంది. టిడిపి మూడో అభ్యర్థిని రంగంలోకి దింపడం ఖాయం కావడంతో వైసిపి ఢిఫెన్స్ లో పడింది. దీంతో క్యాంప్ నిర్వహించి ఎమ్మెల్యేలు చేజారకుండా జాగ్రత్త పడేందుకు చర్యలు ఆరంభించింది.
Recommended Video
ఎపికి లో ఖాళీ అయిన మూడు రాజ్య సభ ఎంపీ సీట్లలో రెండు టిడిపికి ఖాయం కాగా మూడో సీటు వైసిపికి దక్కాల్సి ఉంది. అయితే ఆ మూడో సీటు దక్కించుకునేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 44 మంది ఎమ్మెల్యేలు వైసిపి దగ్గర ఉన్నా వారిలో ఒక్కరు చేజారినా ఆ ఎంపీ సీటు చేజారి పోయే ప్రమాదం ఉంది. దీంతో క్యాంపు నిర్వహించి తమ ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా మిస్ కాకుండా చూసేందుకు వైసిపి ఆల్రెడీ ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఆ ప్రణాళిక ప్రకారం వైసిపి ఎమ్మెల్యేలను ఏకంగా విదేశాలకు తరలించాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
రాజ్యసభ ఎన్నికల...నోటిఫికేషన్ విడుదల
సోమవారం రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో మూడు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వీరిని మార్చి 23న ఎన్నిక జరగనుంది. ఎన్నికయ్యే అభ్యర్థులు ఆరేండ్లపాటు అంటే...2024 వరకు పదవిలో కొనసాగుతారు. మూడుస్థానాల ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ ఫిబ్రవరి 23న షెడ్యూల్ను జారీచేసింది. సోమవారం నుంచే నామినేషన్ల స్వీకరణ మొదలైనప్పటికీ, తొలిరోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 12వ తేదీతో గడువు ముగియనుంది.
మూడో సీటు కోసం...బరిలో టిడిపి అభ్యర్థి
వాస్తవానికి ఎమ్మెల్యే బలాబలాల సంఖ్యను అనుసరించి ఎపికి చెందిన మూడు రాజ్యసభ సీట్లలో టిడిపి రెండు, వైసిపికి ఒక సీటు దక్కాలి. ఒక్కో ఎంపీ సీటు కోసం 44 మంది ఎమ్మెల్యేలు కావాల్సి ఉండగా టిడిపి కి అదనంగానే ఉన్నారు. వైసిపి విషయానికొస్తే ఫిరాయింపు ఎమ్మెల్యేలు పోను సరిగ్గా మ్యాజిక్ ఫిగర్ 44 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. దీంతో ఒక్క ఎమ్మెల్యే ప్రలోభానికి గురైనా ఆ పార్టీ ఎంపీ సీటు చేజారుతుంది. మరోవైపు టిడిపి మూడో సీటు కోసం రంగంలోకి దిగుతున్నట్లు తెలియడంతో వైసిపిలో ఆందోళన మొదలైంది.
వైసిపి ఎమ్మెల్యేలు...ఢిల్లీ నుంచి విదేశాలకా?...
దీంతో తమ ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా మడం తిప్పకుండా చూడాల్సిన ఒత్తిడి వైసిపి అధిష్టానంపై పడటంతో క్యాంపు రాజకీయం తప్పదని వైసిపి నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా ప్రత్యేకహోదా డిమాండ్ కోసం ఢిల్లీలో ఆందోళనలో పాల్గొనేందుకు వచ్చిన వైసిపి ఎమ్మెల్యేలను ఆ పార్టీ అధిష్టానం ఢిల్లీ నుంచి విదేశాలకు పంపాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తద్వారా తమ ఎమ్మెల్యేలు ఎవరికి టచ్లోకి రానివ్వకుండా పకడ్బందీగా వ్యవహరించాలని వైసీపీ జాగ్రత్త పడుతున్నట్లు తెలిసింది.
ఏం జరగనుంది?...తీవ్ర ఉత్కంఠ...
టిడిపి మూడో సీటు కోసం అభ్యర్థిని బరిలోకి దింపనుండటంతో వైసిపిలో ఆందోళన చోటుచేసుకోగా టిడిపి అధికార పార్టీ కావడంతో సహజంగానే ఫిరాయింపు విషయమై ధీమాతో ఉంది. దీంతో పరిస్థితి టిడిపికి చెలగాటం...వైసిపికి ప్రాణసంకటంలా కనిపిస్తోంది. అయితే వైసిపి తమ సర్వశక్తులు సమీకరించి ఎలాగైనా తమ ఎమ్మెల్యేలను కాపాడుకొని ఆ మూడో సీటును ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోకూడదని పట్టుదలతో ఉండటంతో ఈ రాజ్య సభ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు టిడిపి రాజ్య సభకు పంపే అభ్యర్థలపై సస్పెన్స్ కొనసాగుతుండగా వైసిపి తరుపున నెల్లూరు పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఖాయం చేసారనే సంగతి తెలిసిందే.