మరికాసేపట్లో ప్రధానితో భేటీ కానున్న జగన్
వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. ఈ నెల 30న ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నఆయన.. ప్రధాని నరేంద్రమోడీతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. ఉదయం ఏడు గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి బయలు దేరిన జగన్.. ఉ.11 గంటలకు మోడీని కలవనున్నారు. ప్రధాని అధికారిక నివాసం 7, లోక్ కల్యాణ్ మార్గ్లో ఈ భేటీ జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జగన్ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న మోడీకి శుభాకాంక్షలు తెలపనున్నారు. 30న జరగనున్న తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా కోరుతూ మోడీకి ఆహ్వాన పత్రిక అందించనున్నారు.
జగన్తో పాటు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. తాజా ఎన్నికల్లో గెలిచిన ఎంపీలు పీవీ మిథున్ రెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డి, బాలశౌరి, నందిగం సురేష్, మార్గాని భరత్ తదితరులు సైతం జగన్ వెంట హస్తినకు వెళ్లినట్లు తెలుస్తోంది.

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహణం కూడా ఢిల్లీకి వెళ్లారు. మోడీతో భేటీ అనంతరం జగన్ మధ్యాహ్నం 12గంటలకు ఢిల్లీలోని ఏపీ భవన్కు చేరుకోనున్నారు. అక్కడ ఏపీ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారులు కాబోయే ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు చెప్పనున్నారు.












Click it and Unblock the Notifications