కాపులకు గుడ్ న్యూస్ చెప్పిన వైసీపీ సర్కార్ .. మహిళలకు ఏటా రూ.15 వేల ఆర్ధిక సాయం
Recommended Video
ఏపీ ప్రభుత్వం పుట్టెడు ఆర్ధిక లోటులో ఉన్న సంక్షేమ పథకాల విషయంలో మాత్రం ఏ మాత్రం తగ్గటం లేదు. ఇప్పటికే అమ్మ ఒడి, వైఎస్సార్ రైతు భరోసా వంటి ఎన్నో మహత్తర పథకాలను అందిస్తున్న వైసీపీ ప్రభుత్వం కాపులకు కూడా ఆర్ధిక సాయాన్ని అందించే మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. కాపులకు, అలాగే కాపు ఉప కులాలకు గుడ్ న్యూస్ అందించింది ఏపీ సర్కార్ .
ఉగాది నుండి ఏపీలో విశాఖ వేదికగా పాలన ... వైసీపీ సర్కార్ తాజా వ్యూహం ఇదేనా ?
45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసున్న కాపు మహిళలకు ఆర్ధిక సహాయం
వైఎస్సార్ కాపు నేస్తం పథకానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం కాపు, తెలగ, బలిజ కులాలు, ఉపకులాలకు చెందిన మహిళలను ఆదుకునేందుకు నిర్ణయం తీసుకుంది . ఇక బీసీ డీ క్రిందకు వచ్చే తూర్పు కాపు సామాజిక వర్గాన్ని ఈ పథకానికి సంబంధించిన జీవోలో పేర్కొనలేదు. ఈ పథకం కింద కాపు, కాపు ఉప కులాల మహిళలకు ప్రతీ ఏటా రూ.15 వేల చొప్పున ఆర్ధిక సాయం అందించనున్నారు. ఇక ఐదేళ్లకు రూ.75 వేలు ఆర్ధిక సాయాన్ని అందించాలని సర్కార్ భావిస్తుంది . 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసున్న మహిళలకు ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు మంగళవారం బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్. కరికాలవలవన్ మార్గదర్శకాలను జారీ చేశారు.
వైఎస్సార్ కాపు నేస్తం పథకానికి అర్హత ఇదే
ఈ పథకం అమలు కోసం 2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈ పథకానికి రూ. 1101.69 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఇక వైఎస్సార్ కాపు నేస్తం పథకానికి దరఖాస్తు చేసుకునే వారు గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేలు.. అలాగే పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ12. వేలు ఆదాయం కలిగి ఉన్నవారు అర్హులు అని పేర్కొన్నారు. కుటుంబానికి 3 ఎకరాల్లోపు మాగాణి లేదా 10 ఎకరాల్లోపు మెట్ట భూమి , రెండూ కలిపి 10 ఎకరాల్లోపు ఉండాలని నిర్ణయించారు. 45-60 వయసు ఉన్న వారు అర్హులు.
ఈ ఏడాది మార్చి నుండి 2024మార్చి వరకు 5ఏళ్ళపాటు అందనున్న సాయం
ఉద్యోగులు అనర్హులు కానీ పారిశుధ్య ఉద్యోగులకు మాత్రం మినహాయింపు ఉంది.ట్యాక్సీ, మినీవ్యాన్ , ఆటో , ట్రాక్టర్ లాంటి వాహనాలను జీవనోపాధి కోసం వినియోగించేవారికి మినహాయింపు ఉంది. కుటుంబంలో ఎవరైనా వృద్ధాప్య, వికలాంగ పెన్షన్ తీసుకుంటున్నా కాపు నేస్తం పొందడానికి అర్హులే. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డ్ కలిగి ఉండటం తప్పనిసరి. ఈ ఏడాది మార్చి నుండి 2024మార్చి వరకు కాపు , కాపు ఉప కులాల మహిళలకు ఈ ఆర్ధిక సాయం అందించనున్నారు.
కాపు, కాపు ఉప కులాల మహిళలకు ఆర్ధిక భరోసా
ప్రభుత్వ పెన్షన్ పొందుతున్న వారు కూడా కాపు నేస్తం పథకానికి అర్హులు కాదు. కుటుంబంలో ఎవరైనా ఆదాయ పన్ను చెల్లిస్తుంటే.. వారు అనర్హులు. ఇక కుటుంబం నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండరాదు . ఇక కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉంటే కూడా అనర్హులుగా పేర్కొన్నారు . ఇక ఈ పథకం కింద లబ్ధిదారులను గ్రామ, వార్డు వాలంటీర్లు ఎంపిక చేస్తారు. వారు ఇంటింటా సర్వే చేసి గుర్తిస్తారు. ఇక అర్హుల జాబితాను గ్రామ, వార్డు సెక్రటేరియట్లలో సోషల్ ఆడిట్ చేసి లబ్దిదారులను నిర్ణయిస్తారు.
పథకం అమలు కోసం ప్రత్యేక పోర్టల్
ఇక ఆ తర్వాత డబ్బులు ఖాతాలో పడగానే ఫోనుకు సందేశం వస్తుంది. ఇక ఈ పథకం అమలు కోసం ప్రత్యేక పోర్టల్ను ఏర్పాటు చేసి అన్ని వివరాలను అందులో పొందుపరచనున్నారు. దీంతో కాపు, కాపు ఉప కులాల ప్రజలకు ఆర్ధిక భరోసా అందనుంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి కాపులకు, కాపు ఉప కులాలకు ఆర్ధిక సహాయం అందించాలని తీసుకున్న నిర్ణయంతో కాపులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.