ఎన్టీఆర్ ఫ్యాన్స్ చంద్రబాబును ఛీకొడుతున్నారు: పార్థసారథి
విజయవాడ: ఎన్టీఆర్ అభిమానులు అంతా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పేరు చెప్తే ఛీకొడుతున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు పార్థసారథి వ్యాఖ్యానించారు. గడప గడపకు వైసిపి కార్యక్రమంలో భాగంగా తాము ఏ ఇంటికి వెళ్లినా చంద్రబాబు చేసిన మోసాలనే చెబుతున్నారని ఆయన అన్నారు.
చంద్రబాబు పాలనకు నూటికి సున్నా మార్కులు వేస్తున్నారని ఆయన శనివారం మీడియా సమావేశంలో అన్నారు. టిడిపి కార్యకర్తలు కూడా రుణమాఫీ జరగలేదని ఫిర్యాదు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పెన్షన్ల కోతతో వికలాంగులు, వృద్ధులు, అవస్థలు పడుతున్నారని ఆయన అన్నారు.

గ్రీన్ జోన్ -3 పేరుతో కృష్ణా జిల్లా రైతులను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు మచిలీపట్నం డీప్ వాటర్ పోర్టు పేరుతో భూములు లాక్కోవాలని చూస్తున్నారని ఆయన చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.
ఇదిలావుంటే, చంద్రబాబుపై సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబుకు భుూమి పిచ్చి పట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మచిలీపట్నం పోర్టుకు 2 వేల ఎకరాలు సరిపోతుందన్న చంద్రబాబు ఇప్పుడు లక్ష ఎకరాలు ఎందుకు సేకరిస్తున్నారని ఆయన అడదిగారు.
ఎక్కడ భూములు కనిపించినా సరే, కార్పోరేట్ కంపెనీలకు కట్టబెట్టాలని చంద్రబాబు చూస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు భూదోపిడీపై ఆదివారంనాడు పది వామపక్ష పార్టీ నేతలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సదావర్తి సత్రం భూముల కొనుగోళ్లలో టిడిపి పెద్దల హస్తం ఉందని ఆయన ఆరోపించారు.
సంక్షేమ పథకాల్లో కోత పెట్టడానికే పల్స్ సర్వే నిర్వహిస్తున్నారని రామకృష్ణ విమర్శించారు. ఈ పాస్ బుక్ విధాన్ని కూడా ఆయన తప్పు పట్టారు.












Click it and Unblock the Notifications