జగన్ కు గట్టి షాక్...టీడీపీలో చేరిన వైకాపా కీలక నేత;వైఎస్ సన్నిహితుడు
విజయనగరం:ఇతర పార్టీల నుంచి చేరికలతో ఉత్సాహంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయనగరంలో జిల్లాలో గట్టి షాకే తగిలింది. ఈ జిల్లాలో వైసిపి కీలక నేత, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు హఠాత్తుగా వైకాపాకు గుడ్బై చెప్పి టిడిపిలో చేరిపోయారు.
ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా పార్వతీపురం విచ్చేసిన మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఆయన టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రశేఖరరాజుకు లోకేశ్ టిడిపి కండువా కప్పి తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుతో పాటు పలువురు విజయనగరం జిల్లా నేతలు పాల్గొన్నారు.

వైసిపి ఆవిర్భావం నుంచి శత్రుచర్ల చంద్రశేఖరరాజు విజయనగరం జిల్లాలో ఆ పార్టీకి కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న చంద్రశేఖరరాజు...జగన్ వైసీపీ స్థాపించిన తరువాత జిల్లాలో అందరికంటే ముందుగా ఆయనకు మద్దతు తెలిపారు. పైగా ప్రస్తుత కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణికి ఆయన స్వయానా మామయ్య కావడం గమనార్హం.
అయితే శత్రుచర్ల చంద్రశేఖరరాజు పార్టీ మారనున్నట్లు కొన్ని నెలల క్రితం నుంచే బలంగా వార్తలు వినిపిస్తున్నా అది నేటికి సాకారం అయింది. కారణాలేంటనేది తెలియదు కానీ సుమారు 6 నెలలుగా చంద్రశేఖరరాజు వైసీపీకి దూరంగా ఉంటున్నారు. ఆమధ్య వైసీపీకి చెందిన బొబ్బిలి రాజులు టీడీపీ తీర్థం పుచ్చుకోవడం, తాజాగా శత్రుచర్ల చంద్రశేఖరరాజు చేరికతో విజయనగరం జిల్లాలో రాజకీయ సమీకరణలు మారుతాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.












Click it and Unblock the Notifications