గన్నవరంలో వైసీపీ నేత ఆత్మహత్యాయత్నం .. వల్లభనేని వంశీ వల్లే అంటూ సంచలన ఆరోపణలు
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం వైసీపీలో వర్గ పోరు, వైసిపి నేత ఆత్మహత్యాయత్నంతో మరోమారు బయటకు వచ్చింది. కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఈరోజు వైసిపి నేత మొగిలిచర్ల జోజిబాబు ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన,సీఎం జగన్ కు మద్దతు పలికిన వల్లభనేని వంశీ , ఆయన అనుచరుడిపై సంచలన ఆరోపణలు చేస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా చర్చనీయాంశమైంది.
గన్నవరం వైసీపీలో మళ్ళీ లొల్లి ... వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా దుట్టా వర్గం ఆందోళన
టీడీపీ నుండి వైసీపీకి వెళ్ళిన నాటి నుండీ వంశీకి ప్రతికూలంగా పరిస్థితులు
టిడిపి నుండి బయటకు వెళ్ళి వైసిపికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన నాటి నుండి వల్లభనేని వంశీ రాకను గన్నవరం వైసిపి శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. వల్లభనేని వంశి, యార్లగడ్డ అనుచరుల మధ్య గొడవలు నిత్యకృత్యంగా మారాయి. ఇరువర్గాల వారు బాహాటంగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ ఆందోళనకు దిగిన సందర్భాలున్నాయి. అంతే కాదు దుట్టా వర్గానికి వల్లభనేని వంశీ వర్గానికి కూడా అసలు పొసగటం లేదు .
కాంట్రాక్టుల విషయంలో వంశీ టార్గెట్ గా దుట్టా వర్గం ఆందోళనలు
టిడిపి నుండి వచ్చిన వంశీ అనుచరులకు అన్ని కాంట్రాక్టులు అప్పగిస్తున్నారని మండిపడిన దుట్టా వర్గం నెల రోజుల క్రితం ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలియజేసింది. కాకులపాడులో మూడు నెలల క్రితం రైతు భరోసా కేంద్రం శంకుస్థాపన సందర్భంగా వల్లభనేని వంశీ, దుట్టా రామచంద్ర రావుల ముందే వైసిపి కార్యకర్తలు రెండు వర్గాలుగా ఏర్పడి బాహాబాహీకి దిగారు. ఇరువర్గాల మధ్య మాటా మాటా పెరగడంతో అది కాస్త రాళ్లు రువ్వుకునే దాకా వెళ్లి పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను శాంతింపజేశారు.
దళితులకు కాంట్రాక్టు పనులు ఇవ్వకుండా వంశీ అడ్డుకుంటున్నారని ఆరోపణ.. ఆత్మహత్యా యత్నం
ఈ నేపథ్యంలోనే తాజాగా దళితులకు కాంట్రాక్టు పనులు ఎందుకంటూ, దళితులకు రావాల్సిన టెండర్లను వల్లభనేని వంశీ ఆయన అనుచరులు అడ్డుకుని తీవ్ర అన్యాయం చేస్తున్నారంటూ జోజి బాబు అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అప్రమత్తమైన స్థానికులు అతనిని అడ్డుకున్నారు. వల్లభనేని వంశీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పని చేస్తున్న క్రమంలో 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు, ఆయన అనుచరులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే వీరి మధ్య పలుమార్లు చోటుచేసుకున్న విభేదాలకు సీఎం జగన్ జోక్యం చేసుకొని వారిద్దరి కలిపినట్లుగా తెలుస్తుంది.
Recommended Video
వైసీపీ నేత ఆత్మహత్యాయత్నంతో మరోసారి బయటపడిన వర్గ విబేధాలు
వల్లభనేని వంశీ కి దుట్టా రామచంద్రరావు వర్గానికి కూడా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితి స్థానికంగా కనిపిస్తోంది. అయితే ఇటీవల కాలంలో నియోజకవర్గంలో కాస్త గొడవలు తగ్గినట్లుగాఅందరూ భావిస్తున్న సమయంలో ఓ వైసీపీ నేత ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం , వల్లభనేని వంశీ పై సంచలన ఆరోపణలు చేయడం గన్నవరం లో పరిస్థితి మారలేదు అనడానికి సంకేతంగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ వల్లభనేని వంశీ కి టిడిపి నుండి బయటకు వెళ్లిన సమయం కలిసి వచ్చినట్టుగా లేదు. వైసీపీలో అడుగడుగునా ఇబ్బందులు పడుతూనే, ప్రతిఘటన ఎదుర్కొంటూనే ఉన్నారు. రకరకాల విమర్శలను, తీవ్ర స్థాయిలో ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.