పలాసలో ఉద్రిక్తత... బస్టాండ్ వద్ద వైసీపీ నాయకుల ధర్నా
తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్ల మధ్య పలాసలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ కార్యాలయం ముట్టడికి వెళ్తామని ప్రకటించిన వైసీపీ నేతలు ఆర్టీసీ బస్టాండ్ వరకు భారీ ర్యాలీగా చేరుకున్నారు. ఎంపీ రామ్మోహన్ నాయుడుకు, నియోజకవర్గ ఇన్ఛార్జి గౌతు శిరీషకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కాలేజ్ వద్దకు ర్యాలీగా బయలుదేరగా 144 సెక్షన్ అమల్లో ఉందంటూ పోలీసులు అడ్డుకున్నారు. పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ శ్రేణులు ముట్టడికి వస్తున్నారనే సమాచారంతో టీడీపీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
పలాస 27వ వార్డు టీడీపీ కౌన్సిలర్ సూర్యనారాయణ ఇళ్లను కూలగొట్టేందుకు అధికారులు ప్రయత్నించారు. దీన్ని టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. మంత్రి సీదిరి అప్పలరాజుపై గౌతు శిరీష అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని, ఆయనకు క్షమాపణ చెప్పాలంటూ వైసీపీ శ్రేణులు డిమాండ్ చేశాయి. 18వ తేదీలోగా క్షమాపణ చెప్పకపోతే 21వ తేదీన టీడీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలోనే పోలీసులు పలాస-కాశీబుగ్గలో 144 సెక్షన్ విధించారు. సూర్యానారాయణను పరామర్శించేందుకు వస్తున్న టీడీపీ నేత నారా లోకేష్ ను శ్రీకాకుళం జాతీయ రహదారిపై పోలీసులు నిర్బంధించారు. పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.