ఆ పండగ తర్వాత చంద్రబాబు ఇంటికే:వైవి సుబ్బారెడ్డి;వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్న స్పీకర్ కోడెల:అంబటి
ప్రకాశం:వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు వల్ల కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. వెలిగొండ ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలనే డిమాండ్ తో ఎంపి సుబ్బారెడ్డి చేపట్టిన పాదయాత్ర మంగళవారంతో ముగిసింది.
పాదయాత్ర ముగింపు సందర్భంగా వెలిగొండ టన్నెల్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలోనే వెలిగొండ ప్రాజెక్ట్ పనులు 70 శాతం పూర్తయ్యాయని చెప్పారు. కానీ చంద్రబాబు తన హయాంలో కేవలం 30 శాతం పనులు కూడా చేయలేకపోతున్నాడని ఆయన దుయ్యబట్టారు. వెలిగొండ ప్రాజెక్టు వద్ద మట్టి పనులే మొదలుకాలేదని, మరి సంక్రాంతిలోగా పనులు ఎలా పూర్తి చేస్తారని ఆయన ప్రశ్నించారు.
వెలిగొండ హెడ్ రెగ్యులేటర్ కంప్లీట్ కాకుండా ప్రాజెక్టు పనులు ఎలా పూర్తి చేస్తారో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని, ప్రజలకు అసలు వాస్తవాలు తెలియజేసేందుకే తాను పాదయాత్ర చేశానని ఆయన స్పష్టం చేశారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత వెలిగొండ ప్రాజెక్ట్ను తాము పూర్తిచేస్తామన్నారు. సంక్రాంతి తర్వాత చంద్రబాబుని ప్రజలే ఇంటికి పంపిస్తారని వైవి సుబ్బారెడ్డి జోస్యం చెప్పారు.
చంద్రబాబు రాష్ట్రంలో కరువును పారద్రోలుతానని ప్రగల్భాలు పలుకుతున్నారని...కనీసం ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యను నివారించగలిగారా అని ఆయన ప్రశ్నించారు. వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే డిమాండ్ తో మాజీ ఎంపి వైవి సుబ్బారెడ్డి కనిగిరి నుంచి వెలిగొండ టన్నెల్ వరకు పాదయాత్ర చేపట్టారు. 14 రోజుల పాటు సాగిన ఈ పాదయాత్రలో ఆయన మొత్తం 207 కిలోమీటర్లు నడిచారు. ముగింపు సభకు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, సీనియర్ నేతలు పార్థసారథి,
అనంతరం మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ సొంత మామ, దివంగత నాయకుడు ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు పెద్ద మోసకారి అని మండిపడ్డారు. వైఎస్సార్ హయాంలోనే వెలిగొండ ప్రాజెక్టు మెజార్టీ పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు త్వరగా పూర్తిచేయాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ప్రాజెక్ట్లను ఏనాడు పట్టించుకోలేదని, వైఎస్సార్ ఉండి ఉంటే ఎప్పుడో వెలిగొండ పూర్తయ్యేదన్నారు.
ప్రజలకు మేలు చేయాలని చంద్రబాబుకి లేదన్నారు. అందువల్ల ప్రజలు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటుతో బుద్ది చెప్పాలని, రాష్ట్ర భవిష్యత్తు కోసం వైఎస్సార్సీపీని గెలిపించాలని ఈ సందర్భంగా మేకపాటి ప్రజలకు పిలుపునిచ్చారు. మరో వైసిపి నేత బాలినేని మాట్లాడుతూ ప్రాజెక్టులను చంద్రబాబు అటకెక్కించారని విమర్శించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే ప్రకాశం జిల్లాలో అభివృద్ధి జరిగిందన్నారు. ప్రస్తుతం ప్రతి పనిలో అవినీతి విచ్చలవిడిగా జరుగతోందని ఆయన ఆరోపించారు.
మరోవైపు హైదరాబాద్ లో వైసిపి కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన వైసిపి నేత అంబటి రాంబాబు స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై విమర్శల వర్షం కురిపించారు. స్పీకర్ కోడెల సిఎం చంద్రబాబు నాయుడి ఫోటోకు పాలాభిషేకం చేయడం ఏంటని అంబటి ప్రశ్నించారు. స్పీకర్ స్థానంలో ఉండే వ్యక్తి అందరికీ ఆమోదయోగ్యంగా, తటస్థంగా వ్యవహరించాలని అంబటి సూచించారు.
కానీ స్పీకర్ కోడెల తీరు చాలా బాధాకరమని...స్పీకర్ వ్యవస్థని భ్రష్టు పట్టేలా ఆయన వ్యవహరిస్తున్నారని అంబటి దుయ్యబట్టారు. కోడెల స్పీకర్ పదవిని వదిలి చంద్రబాబుకు పాలాభిషేకం చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య విలువలను మంట కలుపుతున్న కోడెల శివప్రసాదరావు వెంటనే స్పీకర్ పదవికి రాజీనామా చేయాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.
మరోవైపు టిడిపి ప్రభుత్వం అప్పు తీసుకురావడం కూడా గొప్పే అన్నట్లు వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. ఎపి ప్రభుత్వం చాలా దుబారా కార్యక్రమాలు చేస్తోందని...పంటి వైద్యం కోసం లక్షలు ఖర్చు చేస్తున్నారని, మరమ్మతుల పేరుతో కోట్ల రూపాయలు అనవసరంగా ఖర్చు పెడుతున్నారని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడే పరిస్థితి ప్రస్తుతం ఏపీలో లేదని వ్యాఖ్యానించారు.