ఆ మాజీ ఎమ్మెల్యేని...వైసిపిలో చేరకుండా అడ్డుకుంటున్నారా?...ఎవరు వాళ్లు?
ప్రకాశం:వైసిపిలో చేరేందుకు యత్నిస్తున్న గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రయత్నాలను కొందరు వైకాపా నేతలే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారా?...అంటే అవుననే సమాధానం వస్తోంది.
గతంలో అన్నా రాంబాబు వ్యవహార శైలి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న పలువురు వైకాపా నేతలు అన్నా రాంబాబును ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలోకి తీసుకోవద్దని గట్టిగా చెబుతున్నారట. అన్నా మీద వస్తున్న ఫిర్యాదులకు దడిసి వైసిపి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఆయన చేరికకు అంత సుముఖంగా లేరని తెలుస్తోంది. అయితే అన్నా మాత్రం తన యత్నాలను విరమించకుండా చేరిక కోసమే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలిసింది.
ఇటీవలే...సంసిద్దత
రాజకీయ భవిష్యత్తు గురించి ఒక అంచనాకి వచ్చిన గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు శుక్రవారం వైఎస్ఆర్సీపి ప్రకాశం జిల్లా ప్రెసిండెంట్ బాలినేని శ్రీనివాసరెడ్డి , ఒంగోలు ఎంపి వైవి సుబ్బారెడ్డిలను కలిసి తాను పార్టీలో చేరేందుకు సంసిద్దత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా గిద్దలూరు ఎమ్మెల్యే టికెట్ విషయమై అన్నా రాంబాబుతో బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టంగా చెప్పేశారట. టికెట్ విషయంలో పార్టీ అధ్యక్షుడు జగన్ దే తుది నిర్ణయమని, ఈ విషయమై తాము ఎటువంటి హామీ ఇవ్వలేమని ఆయన స్పష్టం చేశారట.
మరో సందేహం...కూడా
ఇదే సందర్భంలో బాలినేని అడిగిన ఓ ప్రశ్నకు అన్నా రాంబాబు ఖంగు తిన్నారట. అసలు వచ్చే ఎన్నికల్లో మీరు పోటీ చేయడానికి అవకాశం ఉందా?...ఆ దిశలో స్పష్టత తీసుకున్నారా?... అని అన్నా ను బాలినేని ప్రశ్నించారని తెలిసింది. కారణం...ఒక కేసు విషయంలో అన్నా రాంబాబుకు మార్కాపురం కోర్ట్ మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. దీనిని దృష్టిలో పెట్టుకునే అన్నా రాంబాబుని బాలినేని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
Recommended Video
స్థానిక నేతలు, కార్యకర్తల...వ్యతిరేకత..
మరోవైపు అన్నా రాంబాబు పార్టీలో చేరికకు వైసిపి అధినేత జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని, అయితే దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని సామెత చందంగా వైకాపాలోని కొందరు స్థానిక నేతలు, కార్యకర్తలు అన్నా రాంబాబు చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తూ అడ్డుపుల్లలు వేస్తున్నారట. ముఖ్యంగా గిద్దలూరుకు చెందిన పలువురు వైకాపా నేతలు బాలినేని, వైవి సుబ్బారెడ్డిలను ఇలా అన్నా రాంబాబు కలసి వెళ్లిన సంగతి తెలిసిన అప్పటినుంచే వీరివురికి ఫోన్లు మీద ఫోన్లు చేస్తూ తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.
కారణం...వ్యవహార శైలి
అన్నా రాంబాబు గతంలో ప్రజారాజ్యం టికెట్ పైన ఎమ్మెల్యేగా గెలిచి ఆతరువాత కాంగ్రెస్ లోకి కలసిపోయినప్పుడు, ఆ తరువాత టిడిపిలో చేరిన నాటినుంచి కూడా చాలా మంది వైసిపి నేతలను తప్పుడు కేసులు పెట్టి తీవ్రంగా వేధించారని వారు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా ప్రత్యేకించి రెడ్డి సామాజిక వర్గం పట్ల అన్నా రాంబాబుకు తీవ్ర వ్యతిరేకత ఉందని, అందుకు ఎన్నో దృష్టాంతాలు కూడా ఉన్నాయని వారు వాదిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో అర్థం కాక బాలినేని, వైవి సుబ్బారెడ్డి తల పట్టుకుంటున్నారట. అయితే వైశ్య సామాజికవర్గానికి చెందిన రాంబాబుకు గిద్దలూరుతో పాటు మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో పట్టుందని మరికొందరు వైసిపి నేతలే అంగీకరిస్తున్నారు.
టిడిపిలో ఇమడలేక...మరేం చెయ్యాలి?
మరోవైపు అన్నా రాంబాబు టిడిపిని వీడేందుకు అంత స్ట్రాంగ్ గా డిసైడ్ అవడానికి కారణం గత కొంతకాలంగా స్థానికంగా ఆ పార్టీలో తనకు ఎదురవుతున్న పరిస్దితులను బట్టేనని తెలుస్తోంది. వైసిపి నుంచి టిడిపి లో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డితో అన్నా రాంబాబుకు ఏమాత్రం పొసగటం లేదని, అన్నా రాంబాబు మాట చెల్లుబడి కావడం లేదని...ఈ విషయమై టిడిపి అధినేత చంద్రబాబుకు చెప్పినా ఫలితం లేకపోవడంతో ఇక ఆ పార్టీలో కొనసాగడం వృధా అని నిర్ణయించుకొన్నారని తెలిసింది. అయితే తన చేరిక పట్ల వైసిపి నేతలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్న విషయం అన్నా రాంబాబుకు కూడా తెలిసిందట. కానీ స్వయంగా అధినేత జగన్ తన చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి తాను పార్టీలో చేరకుండా ఆపడం ఎవరి వల్లా కాదని ఆయన ధృడవిశ్వాసంతో ఉన్నారట.