పగబట్టి కక్ష తీర్చుకుంటాం: ఎపి అధికారులకు చెవిరెడ్డి హెచ్చరిక
రాజమండ్రి : అధికార తెలుగదేశం పార్టీ అండతో న్యాయాన్ని విస్మరించి ప్రవర్తించే అధికారులపై పగపట్టి కక్ష సాధింపు చర్యలకు పాల్పడతామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి హెచ్చరించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
అధికారులు పద్ధతి తప్పితే ఈ రోజు బాగానే ఉంటుందని భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడతారని హెచ్చరించారు. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కూడా పశ్చాత్తాప పడేలా చర్యలు ఉంటాయని ఆయన అధికారులను హెచ్చరించారు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న టీడీపీ ప్రభుత్వం పతనం దగ్గరలోనే ఉందన్నారు.
కాగా, అక్రమ కేసులతో పోలీసులు ఏమీ పీకలేరని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర కార్యదర్శి జక్కంపూడి రాజా అన్నారు. ఆగస్టు 29న వైసీపీ బంద్ సందర్భంగా అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లిన రాజా సోమవారం బెయిల్పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి.