పోస్టర్ కలకలం, 'సోనియాతో ఇటలీ బాషలో బాబు', 'ఎంతకైనా తెగిస్తాం'
అమరావతి: ఏపీ రాజధాని అమరావతిలో కాట్రగడ్డ బాబు పేరుతో వెలిసిన పోస్టర్ కలకలం రేపుతోంది. ఏపీ రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న బిజెపికి తెలుగు ప్రజలు బుద్ది చెబుతారని ఏర్పాటు చేసిన పోస్టర్ కలకలం రేపుతోంది.
మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఇటలీ భాష నేర్చుకొని సోనియాతో మాట్లాడారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు.
ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో వేగంగా మార్పులు చోటు చేసుకొంటున్నాయి. 2014 ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదాను ఇస్తామని బిజెపి హమీ ఇచ్చింది.ఈ హమీని అమలు చేయాలని టిడిపి కోరుతోంది.
ప్రత్యేక హోదా బదులుగా ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ప్రత్యేక ప్యాకేజీలో ప్రకటించిన నిధులను కూడ అమలు చేయలేదని టిడిపి నేతలు తీవ్ర అసంతృప్తితో కేంద్ర మంత్రివర్గం నుండి వైదొలిగారు

కలకలం రేపుతోన్న పోస్టర్
అమరావతిలో కాట్రగడ్డ బాబు పేరుతో వెలిసిన పోస్టర్ ప్రస్తుతం తీవ్ర సంచలనం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీ తల్లిని చంపింది, బిజెపి బిడ్డ గొంతు నులుముతోందన్నారు. అంతేకాదు కాంగ్రెస్ను భూస్థాపితం చేసిన తెలుగు ప్రజలు బీజేపీకి బుద్ధి చెబుతారు అంటూ ఆ పోస్టర్లో రాశారు. ఈ పోస్టర్ రాజకీయంగా దుమారాన్ని రేపుతోంది. ఏపీకి బిజెపి అన్యాయం చేసిందని అన్ని పార్టీలు చెబుతున్నాయి.ఈ తరుణంలో ఈ పోస్టర్ ఏర్పాటు చేయడం కలకలాన్ని రేపుతోంది.

రాష్ట్రాభివృద్దికి కట్టుబడి ఉన్నాం
కేంద్ర ప్రభుత్వంలో టిడిపి ఉన్నా లేకపోయినా ఏపీ రాష్ట్రాభివృద్దికి తమ పార్టీ కట్టుబడి ఉందని బిజెపి నేత రఘురాం అభిప్రాయపడ్డారు. ఓ తెలుగు న్యూస్ ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో రఘురామ్ ఈ వ్యాఖ్యలు చేశారు."టీడీపీ మాతో ప్రభుత్వంలో లేదు కానీ మాకు ఇప్పటికీ మిత్రపక్షమే. ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నది. ఎన్డీఏలో ఉన్న వాళ్లు బయటికెళ్లిపోయినా.. కొత్తవాళ్లొచ్చినా మాకు సంతోషమే. దేశం అభివృద్ధి ఎంత ముఖ్యమో రాష్ట్రాభివృద్ధి కూడా అంతే ముఖ్యం. ఏపీకి జరిగిన అన్యాయం గురించి స్వయానా ప్రధానికి తెలుసు" అని రఘురాం తెలిపారు.

ఇటలీ భాష నేర్చుకొని సోనియాతో బాబు మాట్లాడారు
వైసీపీ ఎమ్మెల్యే రోజా ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై గురువారం నాడు విమర్శలు గుప్పించారు.చంద్రబాబు ఇటలీ భాష నేర్చుకుని మరీ రాష్ట్ర విభజన చేయాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీని నాడు అడిగారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రోజుకో మాట చెబుతూ ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని, కేంద్ర మంత్రి వర్గం నుంచి వైదొలగడం కాదని, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ప్రత్యేక హోదా కోసం టీడీపీ పోరాడాలని సూచించారు. టీడీపీ ఆ విధంగా చేస్తే తాము మద్దతు ఇస్తామని అన్నారు.

ఎంతకైనా తెగిస్తాం
రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతవరకైనా వెళ్తామని ఏపీ రాష్ట్ర మంత్రి జవహర్ అన్నారు. గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.రాష్ట్ర ప్రయోజనాల కోసం వెనక్కి తగ్గమన్నారు. ఈ విషయం కేంద్ర మంత్రుల రాజీనామాతో రుజువైందని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్లో చర్మకారులు, డప్పు కళాకారులకు నిధుల కేటాయింపు సంతోషమన్నారు. అన్యాక్రాంతమైన లిడ్క్యాప్ భూములను స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications