అవినీతి సొమ్ము విదేశాలకు తరలింపు...ఒక సామాజిక వర్గానికి కొమ్ముకాయడం:చంద్రబాబుపై విజయసాయిరెడ్డి
పశ్చిమ గోదావరి:ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు 5లక్షల కోట్ల అవినీతి సొమ్మును విదేశాలకు తరలించారని విజయసాయిరెడ్డి ఆరోపించారు.
అంతేకాకుండా టీడీపీ ప్రభుత్వం ఒక సామాజికవర్గానికే కొమ్ముకాస్తోందని ఆయన దుయ్యబట్టారు. జగన్ పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ విజయ్మాల్యా, నీరవ్ మోదీలా విదేశాలకు పారిపోయే ఆలోచనలో సీఎం చంద్రబాబు, లోకేష్ ఉన్నారని ఆరోపించిన విజయసాయి తాజాగా మరోసారి ఈ ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యమంత్రి చంద్రబాబును కేంద్ర ప్రభుత్వం బోనెక్కించాలి...ఆయన రూ.5 లక్షల కోట్ల ప్రజాధనం దోచి విదేశాల్లో దాచారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మంగళవారం రాజమండ్రిలో ఆరోపించిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమని చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్...ఆర్థిక నేరగాళ్లు విజయ్మాల్యా, నీరవ్ మోదీలా విదేశాలకు పారిపోయే ఆలోచనలో ఉన్నారని విజయసాయి అంటున్నారు.

అందువల్ల చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పాస్పోర్టులను వెంటనే సీజ్ చేసి బోనులో నిలబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజయసాయి డిమాండ్ చేశారు. బుధవారం పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన చంద్రబాబు, లోకేష్, టిడిపి ప్రభుత్వం అవినీతిపై మరిన్ని ఆరోపణలు సంధించారు. అవినీతి, అక్రమాలకు పెద్ద ఎత్తున పాల్పడటం వల్లే ఐటీ దాడులంటే చంద్రబాబు భయపడుతున్నారని విజయసాయిరెడ్డి పునరుద్ఘాటించారు.
కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీల్లో ఏది అధికారంలోకి వస్తే మళ్లీ చంద్రబాబు ఆ పార్టీతో సిగ్గు నిరభ్యంతరంగా కలుస్తారని విజయసాయి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందా అని తనను ప్రశ్నించిన విలేకరులతో ఇంతవరకు పొత్తులపై నిర్ణయం తీసుకోలేదని విజయసాయి అన్నారు. వైసీపీ బాధితులంతా జనసేనలో చేరిపోతున్నారు కదా అని విలేకరులు ప్రశ్నించగా అసంతృప్తిగా ఉన్న వారు వేరే పార్టీలోకి వెళ్లడం సహజమని, వైసీపీ సిద్ధాంతాలు నచ్చిన వారిని తాము ఆహ్వానించడం జరుగుతుందని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications