విజయసాయి రామతీర్ధం పర్యటనలో హై టెన్షన్ , కారు అద్దాలు ధ్వంసం .. లోకేష్ సవాల్ కు వైసీపీ ఎంపీ రెడీ
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయాలు రామతీర్థం రామాలయం చుట్టూ తిరుగుతున్నాయి. ఒక పక్క చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తతతో పాటుగా మరో పక్క వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రామతీర్థం పర్యటన ఉద్రిక్తంగా మారింది. వైసీపీ ఎంపీ విజయసాయి రామతీర్థం పర్యటన పట్ల స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్, టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్న సమయంలోనే విజయ సాయి రెడ్డి రామతీర్థం రామాలయాన్ని పర్యటించడం పలు ఉద్రిక్తతలకు కారణమైంది.

విజయసాయి కారు అద్దాలు ధ్వంసం .. రామతీర్ధంలో ఉద్రిక్తత
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పర్యటన వ్యతిరేకిస్తున్న టీడీపీ శ్రేణులు, నిరసనకారులు కాన్వాయ్ పై చెప్పులు, రాళ్లు విసిరారు. విజయ సాయి కారు అద్దాలు ధ్వంసం చేశారు .ఈ ఘటనపై వైసీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మూడు పార్టీల నేతల పర్యటన నేపథ్యంలో మూడు పార్టీలకు చెందిన భారీగా కార్యకర్తలు రామ తీర్థానికి చేరుకుని ఆందోళన కొనసాగిస్తున్నారు. పోటాపోటీగా ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో రామతీర్థం ఆలయం వద్దకు చేరుకున్న విజయసాయి రెడ్డి పై ఒక్కసారిగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలు విరుచుకుపడ్డారు.

ఆలయాన్ని సందర్శించిన విజయసాయి .. ప్రతిపక్షాలపై ఆగ్రహం
విజయ సాయి కారు అద్దాలను ధ్వంసం చేయగా మరో కారులో విజయసాయి రెడ్డి రామతీర్థం ఆలయాన్ని సందర్శించారు. వైసీపీ శ్రేణులతో కలిసి ఘటన జరిగిన ప్రాంతాన్ని, కొండ పైన ఉన్న కొలను ప్రాంతాన్ని పరిశీలించారు. ఆలయంలో ఘటన తాలూకు వివరాలను అక్కడి అర్చకులను అడిగి తెలుసుకున్నారు విజయసాయిరెడ్డి.
ఇక ఈ ఘటనపై స్పందించిన విజయసాయిరెడ్డి రామతీర్థం ఘటన శోచనీయమని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వాన్ని తప్పుబట్టేలా ప్రతిపక్ష నాయకులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సింహాచలం అప్పన్న సన్నిధికి వస్తా .. లోకేష్ సవాల్ కు విజయసాయి జవాబు
టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలకు అంబాసిడర్ అంటూ ధ్వజ మెత్తారు. ఇక లోకేష్ చేసిన సవాల్ ను తాను స్వీకరిస్తున్నానని, సింహాచలం అప్పన్న సన్నిధికి తాను వస్తానని, చర్చకు సిద్ధంగా ఉన్నామని తేదీ చెప్పాలని ప్రకటించారు విజయసాయిరెడ్డి. ప్రపంచంలో ఎక్కడ మంచి జరిగినా చంద్రబాబు వల్లే అని చెప్పుకుంటారని, చెడు జరిగితే ఇతరులపై రుద్దే వ్యక్తిత్వం చంద్రబాబుదని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. రామతీర్థంలో విజయసాయి పర్యటనను టిడిపి శ్రేణులు అడుగడుగునా అడ్డుకున్నారు, బిజెపి సైతం విజయసాయిరెడ్డి రాకపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.












Click it and Unblock the Notifications