వైసీపీది నాటకమే, మేం రాజీనామా చేస్తే.. ఇక పోరాడేదెవరు?: మురళీమోహన్
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలని వస్తున్న డిమాండ్పై రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు మురళీమోహన్ స్పందించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ... టీడీపీ ఎంపీలు రాజీనామా చేస్తే పార్లమెంట్లో ఇక పోరాడేది ఎవరంటూ ప్రశ్నించారు.
Recommended Video
కేంద్రంపై అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చి వైసీపీ నాటకాలు ఆడుతోందంటూ మురళీమోహన్ దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా సాధన కోసం టీడీపీ ఎంపీలు కూడా తమ పదవులకు రాజీనామా చేయాలంటూ వైసీపీ, జనసేన ఇటీవల డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
అంతేకాదు, ప్రస్తుత పార్లమెంటు సమావేశాల చివరి రోజున తమ పార్టీ ఎంపీలు కూడా రాజీనామా చేస్తారంటూ వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి వెల్లడించారు. తాము స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామాలు సమర్పిస్తామని... టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేస్తే బాగుంటుందని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చే వరకు పార్లమెంట్లో నిరసనలు కొనసాగించాలని, అప్పటికీ కేంద్రం దిగిరాకపోతే పార్లమెంట్ వాయిదా పడిన రోజునే వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలని తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ సూచించారని మేకపాటి సోమవారమే పేర్కొన్నారు. ఈ పరిణామాలపై ఎంపీ మురళీమోహన్ను కదిలించగా ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు.