టీడీపీపై వైసీపీ రివర్స్ ఎటాక్ .. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపు
మూడు రాజధానుల ఏర్పాటు వ్యవహారం ఏపీలో తీవ్ర దుమారం రేపుతూనే ఉంది. అధికార వికేంద్రీకరణపై శాసన సభ, మండలిలో టీడీపీ వ్యవహరించిన తీరుపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మండలిలో బిల్లు ఆమోదం పొందనీకుండా టీడీపీ వ్యవహరించింది అన్న భావనలో ఉన్న వైసీపీ ఈ క్రమంలో టీడీపీ వైఖరికి నిరసనగా పెద్దఎత్తున ఆందోళనలకు పిలుపునిచ్చింది.

రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ యువజన, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో వరుస నిరసనలు
ఏపీలో తాజా పరిణామాల నేపధ్యంలో మూడు రాజధానుల ఏర్పాటుకు అడ్డు తగులుతూ మూడు ప్రాంతాల అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నారని టీడీపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న వైసీపీ ఆందోళనల బాట పట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ యువజన, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో వరుస నిరసనలు, ఆందోళనలు చెయ్యాలని నిర్ణయం తీసుకుంది. అధికార, పరిపాలన వికేంద్రీకరణతో రాష్ట్ర సమగ్రాభివృద్ధి చెయ్యాలని ,13 జిల్లాల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ ముఖ్యులు నిర్ణయించారు.

నేడు యూనివర్సిటీల వద్ద చంద్రబాబు దిష్టిబొమ్మల దహనం
ఇక ఈ క్రమంలోనే నేటి నుండి చెయ్యతలపెట్టిన ఆందోళనల కార్యక్రమాలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇంచార్జ్ లు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు చేపట్టేందుకు షెడ్యూల్ను విడుదల చేశారు వైసీపీ నేతలు . ఇందులో భాగంగా 25వ తేదీ శనివారం యూనివర్సిటీల వద్ద చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేయనున్నారు.
27వ తేదీనాడు యువజన విభాగం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహించనున్నారు .

సదస్సులు, సంతకాల సేకరణ, పోస్టు కార్డుల ఉద్యమాలు
28 వ తేదీన పార్టీ విద్యార్ధి విభాగం ఆధ్వర్యంలో అభివృద్ధి వికేంద్రీకరణపై యూనివర్సిటీల వద్ద సదస్సులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక 29 వ తేదీన పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ప్రధాన కూడళ్లలో సంతకాల సేకరణ నిర్వహించాలని కార్యాచరణ రూపిందించారు. 30 వ తేదీన వికేంద్రీకరణ విషయంలో టీడీపీ తీరుపై రాష్ట్రపతికి పోస్టుకార్డులు పంపే ఉద్యమం చెయ్యాలని, 31వ తేదీన తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మూడు ప్రాంతాల జేఏసీ నాయకుల సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

వైసీపీ యూత్ ఆధ్వర్యంలో కార్యాచరణ.. ఆందోళనల పర్వం
మూడు రాజధానుల నిర్ణయానికి అడ్డు తగులుతున్న చంద్రబాబును , టీడీపీని ప్రజా క్షేత్రంలో ఎండగట్టాలని , తద్వారా ప్రజలకు మూడు రాజధానుల నిర్ణయం ఆవశ్యకత తెలియజెయ్యాలని భావిస్తుంది వైసీపీ . ఇప్పటికే చంద్రబాబు అండ్ టీం మండలిలో బిల్లు ఆమోదం పొందనీకుండా చేసిన పనికి వైసీపీ నిప్పులు చెరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. ఇప్పుడు తాజాగా వైసీపీ యూత్ ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రకటించటంతో రాష్ట్రంలో నిరసనలు మార్మోగనున్నాయి.












Click it and Unblock the Notifications