వైఎస్ కుటుంబాన్ని వేధిస్తే సహించం:వైసిపి ఎస్సీ విభాగం;జగన్ కు డబ్బు పిచ్చి:ఆది
తిరుపతి:బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకున్న సీఎం చంద్రబాబు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని వేధించాలని చూస్తే సహించేది లేదని వైసీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలారి రాజేంద్ర హెచ్చరించారు.
తిరుపతి దొడ్డాపురం వీధిలోని వైకాపా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారతి సిమెంట్ షేర్లు పెరిగినట్లు 2011లో జగన్పై తప్పుడు కేసులు బనాయించి అన్యాయంగా జైలు పాలు చేశారని విమర్శించారు. అయితే ఏడేళ్ల తర్వాత జగన్ సతీమణి భారతి పేరును చార్జిషీట్లో చేర్చటం వెనుక ఖచ్చితంగా సీఎం చంద్రబాబు కుట్ర ఉందని ఆరోపించారు.
మరోవైపు పశ్చిమ గోదావరి నరసాపురంలో మంత్రి అదినారాయణరెడ్డి వైసిపి అధ్యక్షుడు జగన్, జనసేన అధినేత పవన్ పై విమర్శల వర్షం కురిపించారు. వైసీపీ ఆధినేత జగన్ను తాను చాలా దగ్గరగా చూశానన్నారు. ఆయనకు ఉదయం లేచినప్పటి నుంచి ఒకటే ఆలోచన.. డబ్బు..డబ్బు...అది సంపాధించేందుకే యాత్ర పేరుతో రోడ్లుపై పడ్డాడడని మంత్రి ఆది ఆరోపించాడు.
కేరళలోని పద్మనాభస్వామికి లక్ష కోట్లు ఆస్తి అని...ఇవి స్వామివారికి భక్తులు ఇచ్చిన కానుకలు అని...అయితే జగన్ మాత్రం తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు అక్రమార్జన సంపాదించాడని మంత్రి ఆది ఆరోపించారు. ఇటువంటి వ్యక్తి మా కడప జిల్లాకు చెందిన వాడు కావడంతో తామంతా సిగ్గుపడుతున్నామన్నారు. వైఎస్ భారతిపై ఈడీ కేసు నమోదు చేయడంపై కూడా జగన్ రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈడీ చంద్రబాబుకు బంధువుకాదని...కేంద్రం ఆధీనంలోని శాఖ అని...కనీసం ఆ విషయం కూడా జగన్కు తెలియదని మంత్రి ఆది ఎద్దేవా చేశారు.
ఆయనకు తెలిసిందల్లా తనకు ఏదైనా చెడు జరిగితే...అది చంద్రబాబే చేశారని ఆరోపించడం ఒక్కటే తెలుసునని ఆయన ఎద్దేవా చేశారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా పెద్ద అనుభవం లేదన్నారు. సినిమాకు, రాజకీయానికి ఎంతో తేడా ఉందని...రాజకీయాలు చేయడం అంటే వేషాలు వేసినంత సులభం కాదన్నారు. పవన్ ను వ్యక్తిగతంగా విమర్శించేందుకు తా ఆసక్తి చూపనన్నారు.