మండలి రద్దుపై వైసీపీ, టీడీపీ దొందూ దొందే, తొలి సమావేశాల్లోనే ఎందుకు రద్దుచేయలేదు: పురందేశ్వరి
అధికార వైసీపీ, విపక్ష టీడీపీపై బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శాసనమండలి రద్దుపై ఇరుపార్టీలు రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. శాసనమండలితో ఉపయోగం లేకుంటే తొలి సమావేశాల్లోనే ఎందుకు రద్దు చేయాలని వైసీపీని ప్రశ్నించారు. వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లు ఉపసంహరణకు మండలి మోకాలడ్డడంతో రద్దు చేయాలనే ఆలోచన వచ్చిందా అని ప్రశ్నించారు. మంగళవారం పురందేశ్వరి తిరుపతిలో మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు కొత్త రాగం..
శాసనమండలిని రద్దు చేయొద్దని విపక్ష నేత చంద్రబాబు నాయుడు కొత్త రాగం తీస్తున్నారని పురంధేశ్వరి ఫైరయ్యారు. మండలి ఏర్పాటునే వ్యతిరేకించినా చంద్రబాబు.. కొత్తగా రద్దు చేయొద్దని అనడం ఏంటి అని ప్రశ్నించారు. ఓ రాజకీయ పార్టీ విధానాలు పూటకో తీరులా మారతాయా అని అడిగారు. అమరావతి ప్రాంతంలో తన సహచరులు భూములు కొనుగోలు చేసినందున.. రాజధాని తరలింపును తాత్కాలికంగా బ్రేక్ వేసిన మండలిని రద్దు చేయొద్దని కొత్త భాష్యం చెప్తున్నారని ఆరోపించారు.

సొంత లాభమే..
వైసీపీ, టీడీపీ స్వార్థ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని పురందేశ్వరి గుర్తుచేశారు. ఆ రెండు పార్టీలకు తగిన బుద్ది చెబుతారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తుందని విమర్శించారు. వైసీపీతోపాటు టీడీపీకి ప్రజల సంక్షేమం, ప్రగతి పట్టదని మండిపడ్డారు. సొంత లాభం, అవినీతి, అక్రమాలే ముఖ్యమని ధ్వజమెత్తారు.

40 వేల కోట్ల అప్పు..
జగన్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని పురందేశ్వరి నిప్పులు చెరిగారు. తన వర్గీయులకు మంచి జరగాలనే ఉద్దేశమే తప్ప..ప్రజల ప్రయోజనాలు జగన్మోహన్ రెడ్డికి పట్టవన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని మరింత వెనక్కి నెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు 2 లక్షల కోట్ల అప్పులు చేస్తే.. 8 నెలల్లో జగన్ 40 వేల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. ఇచ్చిన హామీలను ఏ విధంగా అమలు చేస్తారని పురందేశ్వరి ప్రశ్నించారు.

ఎంక్వైరీ చేయండి..
ప్రభుత్వం నిరంతరం కొనసాగే ప్రక్రియ అని.. ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మరో ప్రభుత్వం ఎలా రద్దు చేస్తుందని ప్రశ్నించారు. ఒకవేళ గత ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకుంటే సవరించొచ్చు అని తెలిపారు. ఆ వ్యవహారంపై విచారణకు కూడా ఆదేశించొచ్చు కదా అని అడిగారు. అమరావతి రైతులు నాయకుడిని చూసే, పార్టీని చూసో భూములు ఇవ్వలేదన్నారు. ప్రభుత్వానికి భూములు ఇచ్చారని గుర్తుచేశారు. రాజధాని మార్పు అంశంపై ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించడం లేదన్నారు. అమరావతి రైతులకు న్యాయం చేయాలని పురందేశ్వరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications