వైసీపీ, టీడీపీ డీఎన్ఏ ఒక్కటే, మూడు రాజధానులు, మండలి రద్దు సరికాదు బీజేపీ నేత మురళీధరరావు
వైసీపీ, టీడీపీపై బీజేపీ నేత మురళీధరరావు మండిపడ్డారు. వారిద్దరీ డీఎన్ఏ ఒక్కటేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధాని విషయంలో వైపీసీది ఒంటెద్దు పోకడ అని విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో వెళ్లడం మంచిది కాదన్నారు. వారికి అనుకూలమైన కమిటీలు వేసి.. నివేదికల ఆధారంగా చర్యలు తీసుకున్నారని ప్రస్తావించారు. శాసనమండలిని ఎందుకు రద్దు చేస్తారు అని మురళీధరరావు ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్లో గెలిచన వైసీపీ, ఓడిపోయిన టీడీపీ డీఎన్ఏ ఒక్కటేనని విమర్శించారు. ఈ రెండు పార్టీలు ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకెళ్తున్నాయని ఆరోపించారు. వారి చర్యలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. వారసత్వ రాజకీయాలకు సమాది కట్టేది బీజేపీ అని మురళీధరరావు స్పష్టంచేశారు. తమ పార్టీలో వారసులు, కుటుంబ రాజకీయాలు ఉండవు, ఉండబోవు అని తేల్చిచెప్పారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ క్రమంగా బలపడుతోందని చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.

Recommended Video

పౌరసత్వ సవరణ చట్టంపై అనవసర ఆందోళనలు జరుగుతున్నాయని మురళీధరరావు అన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేవారిపై కఠినచర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. కొందరు దేశ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి కుట్రలను బీజేపీ ఎదుర్కొంటుందని స్పష్టంచేశారు. ఆందోళనల వెనక ఉన్నవారిని కఠినంగా శిక్షిస్తామని మురళీధరరావు తేల్చిచెప్పారు. ఎవరినీ వదిలిపెట్టబోమని స్పష్టంచేశారు.












Click it and Unblock the Notifications