ఏపీ శాసనమండలి నిరవధికంగా వాయిదా, ఆమోదం పొందని ద్రవ్య వినిమయ బిల్లు, సభలో గొడవ..
కీలకమైన బిల్లులకు ఆమోదం తెలుపకుండానే ఆంధ్రప్రదేశ్ శానసమండలి నిరవధిక వాయిదా పడింది. ద్రవ్య వినిమయ బిల్లుకు కూడా ఎగువసభ ఆమోదం తెలుపకపోవడంతో.. ఖజానా నుంచి నిధుల విడుదల అంశం ప్రశ్నార్థకంగా మారింది. అంతకుముందు మండలిలో వైసీపీ, టీడీపీ సభ్యుల బాహాబాహీకి దిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనను సభ్యుడు నారా లోకేశ్ ఫోటోలు తీయడం మరో వివాదానికి దారితీసింది. మొత్తంగా రెండోరోజు మండలి వాడీ వేడీగా జరిగి.. వాయిదా పడింది.
13 బిల్లులు
రెండోరోజు మండలికి 13 బిల్లులపై చర్చ జరిగి ఆమోదించాల్సి ఉంది. భోజన విరామం తర్వాత 9 బిల్లులకు ఎగువ సభ చర్చ జరిపి, ఆమోదం తెలిపింది. కానీ రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు, ద్రవ్య వినిమయ బిల్లు, ఎడ్యుకేషన్ అమెండ్మెంట్ బిల్లుపై చర్చ జరిగి.. ఆమోదం తెలుపాల్సిన సమయంలో వివాదం జరిగింది. తర్వాత మరో రెండు బిల్లులు శాసనసభ నుంచి వచ్చాయి. అంటే మొత్తంగా ఆరు బిల్లులను మండలి ఆమోదించాల్సి ఉంది. ఈ క్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ.. సీఆర్డీఏ రద్దు, రాజధాని వికేంద్రీకరణ బిల్లుపై చర్చ జరపాలని కోరారు. దీనిపై మండలిలో విపక్ష నేత యనమల రామకృష్ణుడు విభేదించారు. తొలుత అప్రొప్రియేషన్ బిల్లు ప్రవేశపెట్టి.. ఆమోదం తెలుపాలని కోరారు. ఇందుకు బొత్స సహా మంత్రులు కుదరదనడంతో గొడవ జరిగింది.
బాహాబాహీ..
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మంతెన సత్యనారాయణ రాజు మధ్య తోపులాట ముష్టిఘాతానికి దారితీసింది. సభలో జరుగుతున్న గొడవను టీడీపీ సభ్యుడు లోకేశ్ ఫోటోలు తీశారు. ఈ విషయాన్ని వైసీపీ సభ్యులు మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం దృష్టికి తీసుకొచ్చారు. ఫోటోలు తీయొద్దని లోకేశ్ను రెడ్డి సుబ్రమణ్యం మందలించినట్టు తెలుస్తోంది. సభలో ముష్టిఘాతాలు, తోపులాటతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో సభలో బిల్లులు ప్రవేశపెట్టి.. చర్చ జరిపే అవకాశం లేని సిచుయేషన్ భావించిన డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం సభను నిరవధికంగా వాయిదా వేశారు.
సరికాదు..
సభలో టీడీపీ సభ్యుల ప్రవర్తనను సభా నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోష్ తప్పుపట్టారు. అపోజిషన్ లీడర్ యనమల రామకృష్ణుడు సభను విచ్చిన్నం చేయాలని చూస్తున్నారని ఫైరయ్యారు. చైర్మన్ నియమ, నిబంధనల ప్రకారం సభను నడిపించడం లేదని మండిపడ్డారు. రూల్ 90 కింద టీడీపీ ఇచ్చిన నోటీసు లీడర్ ఆఫ్ హౌన్ తనతో చర్చించాలి.. ఒకరోజు ముందే తనతో డిస్కస్ చేస్తే అందుకు ఆమోదం తెలుపాలి. కానీ ఇవాళే టీడీపీ సభ్యులు ప్రతిపాదిస్తే, చైర్మన్ అడ్మిట్ చేయడం ఏంటో అర్థం కావడం లేదన్నారు. దానిని రూల్ 94 కింద తాను అభ్యంతరం తెలిపానని చెప్పారు. ఇంతకీ సభలో రూల్స్ బుక్స్ అమల్లో ఉన్నాయా లేవా అని అడిగారు. ద్రవ్య వినిమయ బిల్లు పాసయితే గానీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి.. అలాంటి కీలక బిల్లుకు కూడా ఆమోదం తెలుపకపోవడం ఏంటీ అని మండిపడ్డారు. ఇక ప్రభుత్వ ఖజానా నుంచి నగదు ఎలా డ్రా చేయాలి అని అడిగారు.
Recommended Video
అప్పటి లాగే
గతంలో మండలి చైర్మన్ షరీఫ్ ఏం చేశారో.. ఇవాళ కూడా అదే చేశారు అని వైసీపీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విరుచుకుపడ్డారు. రూల్ 90 కింద చర్చకు షరీఫ్ అడ్మిట్ చేస్తే.. దానిని సాగదీసి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం నిరవధికంగా వాయిదా వేశాడని పేర్కొన్నారు. వీరికి సభ అంటే గౌరవం లేదు అని.. టీడీపీ ఏం చెబితే అదే జరగాలి అన్నట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.