Year Ender 2020: కోలుకోలేని జగన్ -ఏపీలో 3 రాజధానులకు ఏడాది -17న అమరావతిలో భారీ సభ

గత సార్వత్రిక ఎన్నికల్లో దేశమంతటా మోదీ ప్రభంజనం కనిపించినా.. వాటితోపాటే జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మాత్రం వైసీపీ ఏకైక విజేతగా నిలిచింది. 22 ఎంపీ సీట్లతో దేశంలోనే నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించడంతోపాటు అసెంబ్లీలో అద్భుతమైన రీతిలో ఏకంగా 151 మెజార్టీతో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. జగన్ పాలన తొలినాళ్లలో.. పంచాయితీ ఆఫీసులకు రంగులు వంటి చిన్న విషయాల్లో చుక్కెదురైనా.. అసలు సిసలు సవాళ్లు, భారీ ఎదురుదెబ్బలు మొదలైంది మాత్రం మూడు రాజధానుల ప్రకటన నుంచే..

 ఏపీలో 3రాజధానులకు ఏడాది..

ఏపీలో 3రాజధానులకు ఏడాది..

రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్.. వరల్డ్ క్లాస్ క్యాపిటల్ సిటీ ఉంటే తప్ప ఆర్థికాభివృద్ధి సాధించలేదని చెప్పిన నాటి సీఎం చంద్రబాబు అమరావతి నిర్మాణానికి అకురార్పణ చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిధిగా ఉద్దండరాయునిపాలెంలో రాజధాని నగర నిర్మాణానికి 2015 అక్టోబర్ 22న శంకుస్థాపన జరగ్గా, ఏడాదిన్నర లోపే సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టులను నిర్మించారు. కానీ అవి శాశ్వత భవనాలు కావని, కేవలం తాత్కాలిక నిర్మాణాలని ప్రభుత్వమే పేర్కొంది. నాలుగేళ్ల సమయంలో ఆ మూడు తాత్కాలిక భవంతులు తప్ప చంద్రబాబు గ్రాఫిక్ లో చూపించిన నిర్మాణాలేవీ అక్కడ చోటుచేసుకోలేదు. 2019 మేలో వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు చిత్తయిపోయి, జగన్ సీఎం అయ్యారు. జీఎస్ రావు, బోస్టన్ తదితర కమిటీల సూచనలు, సలహాల మేరకు ఏపీకి అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండబోదని, మొత్తం మూడు రాజధానులు ఉంటాయని 2019 డిసెంబర్ 17 సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా క్లారిటీ ఇచ్చారు. అదే రోజు నుంచి అమరావతిలో రైతుల నిరసలు మొదలయ్యాయి. ఏడాది కాలంగా రాజధానిపై కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది..

అన్నిటికీ కారణం క్యాపిటలే..

అన్నిటికీ కారణం క్యాపిటలే..

జగన్ సీఎం అయితే అమరావతిని తరలిస్తారని ఎన్నికలకు ముందు ప్రచారం జరగ్గా, వాటిని వైసీపీ ఖండించింది. కానీ అనుమానించినట్లుగానే సీఎం అదే పని చేశారు. కాకుంటే పరిపాలన వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులు ఏర్పాటుచేస్తున్నట్లు అధికారికంగా చెప్పారు. అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుందని, కార్యనిర్వాహక రాజధానిగా విశాకపట్నం, న్యాయరాజధానిగా కర్నూలు ఉంటాయని తెలిపారు. మరోవైపు చంద్రబాబు హయాంలో అమరావతిలో జరిగిన భూపందేరాలపైనా జగన్ సర్కారు విచారణ జరిపించింది. 2020 జనవరి 26 వేడుకలను విశాఖలోనే నిర్వహిస్తారని, ఉగాది నాటికి మొత్తం షిఫ్ట్ అయిపోతుందని ప్రభుత్వ పెద్దలు కూడా ప్రకటించారు. మూడు రాజధానుల బిల్లును తిరస్కరించిన కారణంగా శాసన మండలిని రద్దు చేయాలని సీఎం భావించారు. కానీ, రాజధాని అమరావతి అంశంతో ముడిపడిన అన్నిటికి అన్ని విషయాల్లో జగన్ సర్కారుకు కోర్టుల్లో భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. ఆ దెబ్బకు..

జడ్జిలు వర్సెస్ జగన్

జడ్జిలు వర్సెస్ జగన్

రాజధానిని అమరావతి నుంచి తరలించడాన్ని సవాలు చేస్తూ కోర్టుల్లో వందలకొద్దీ పిటిషన్లు దాఖలయ్యాయి. మూడు రాజధానుల బిల్లును తిప్పిపంపిన మండలిని రద్దు చేయాలన్న నిర్ణయం కూడా వివాదాస్పదమైంది. అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్(భూకుంభకోణం)పై ఏడాదిన్నరగా విచారణ జరుగుతున్నా నిందితుల్ని బొక్కలోకి తోసేసే బలమైన ఆధారాలేవీ లభించలేదనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం మూడు రాజధానుల్ని నోటిఫై చేసిన తర్వాత కూడా కోర్టులు వాటిని నిలిపేశాయి. ఇలా అమరావతితో ముడిపడిఉన్న ప్రతి అంశంలో తనకు వ్యతిరేక తీర్పులు వస్తుండటంతో వైసీపీ అధినేత జగన్ ఏకంగా జడ్జిలపైనే పోరాటానికి దిగారు. హైకోర్టులోని కొందరు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణలపై చీఫ్ జస్టిస్ బోబ్డేకు సీఎం జగన్ ఫిర్యాదు లేఖరాయడం దేశచరిత్రలోనే అరుదైన ఘట్టంగా నిలిచింది.

 ముందరికాళ్లకు బంధం

ముందరికాళ్లకు బంధం

రాజధానికి సంబంధించి అంశాల్లో అన్ని వైపుల నుంచి పడుతోన్న దెబ్బలకు సీఎం జగన్ ఇంకా కోలుకోలేదు. ఏదీ చేయాలన్నా ముందరికాళ్లకు బంధంలా అమరావతి రాచపండు అడ్డుపడుతూనే ఉంది. జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసిన డిసెంబర్ 17 నుంచే అమరావతి వేదికగా రైతులు, స్థానికులు నిరసనలకు దిగారు. తొలినాళ్లలో భారీ ఎత్తున సాగిన నిరసలు.. కరోనా కారణంగా దాదాపు ఎనిమిది నెలలు చిన్న సమూహాలు, ఇంటి పోరాటాల స్థాయిలోనైనా కొనసాగాయి. ప్రస్తుతం ఏపీలో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో అమరావతి నిరసనలు మళ్లీ ఊపందుకున్నాయి. ఇటీవల మూడు రాజధానులకు మద్దతుగా పోటీ ఉద్యమకారులు సైతం దీక్షలకు దిగారు. మొత్తంగా అమరావతిలో ఆందోళనలు మొదలై ఏడాది పూర్తవుతోన్న సందర్భంగా ఈనెల 17న భారీ కార్యక్రమాలు నిర్వహించేందుకు అమరావతి పరిరక్షణ సమితి జాయింట్ యాక్షన్ కమిటీ (ఏపీఎస్‌జేఏసీ) ప్రణాళికలు సిద్ధం చేసింది.

మోదీ శిలాన్యాసం చేసిన చోటనే.

మోదీ శిలాన్యాసం చేసిన చోటనే.

అమరావతి ఉద్యమం చేపట్టి డిసెంబర్ 17 నాటికి ఏడాది(365 రోజులు) పూర్తి కానున్న సందర్భంగా అమరావతి పరిరక్షణ సమితి ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. అందులో భాగంగా ఈనెల 12 నుంచి 17 వరకు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. 12న గుంటూరులో మహాపాదయాత్ర చేపట్టారు. సోమవారం (14న) తుళ్ళరులో కిసాన్ సమ్మేళనం, మంగళవారం(15న) విజయవాడలో పాదయాత్ర చేపట్టనున్నారు. గురువారం నాడు(17న) ప్రధాని మోదీ అమరావతికి శిలాన్యాసం చేసిన ఉద్దండరాయునిపాలెంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని జగన్ సర్కారు వెనక్కి తీసుకుని, అమరావతిలోనే రాజధాని అని ప్రకటించే వరకు ఉద్యమం ఆగబోదని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. మరోవైపు రాజధాని వివాదానికి సంబంధించిన పిటిషన్ల విచారణ కూడా తుది దశకు చేరింది. సంక్రాంతిలోపే తుది తీర్పులు వెలువడే అవకాశాలున్నాయి. రాజధాని విషయంలో ఈ ఏడాదిలాగే జగన్ కు మళ్లీ(వచ్చేఏడాది కూడా) ఎదురుదెబ్బలు తగులుతాయా, పరిస్థితి అనుకూలిస్తుందా అనేది వేచిచూడాలి..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+