year ender 2020- ఈ ఏడాది ఏపీలో పథకాల పందేరం- కరోనాలోనూ-చరిత్రలో తొలిసారి
ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవడం ఎన్నికైన ప్రభుత్వాల బాధ్యత. ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం పథకాలు అమలవుతాయో లేదో అని ప్రజలు ఎదురు చూడాల్సిన పరిస్ధితులు. ఇలాంటి తరుణంలో గత ప్రభుత్వాల తప్పిదాల కారణంగా హామీలపైనే నమ్మకం పోయిన ఏపీ ప్రజలకు వైసీపీ సర్కారు ఈ ఏడాది పథకాల పందేరంలో ముంచేసింది. ఎన్నికల్లో ఇచ్చిన నవరత్నాల హామీల్ని నిలబెట్టుకుంటూ వైసీపీ సర్కారు కరోనాలో సైతం పథకాలను కొనసాగించడం కొసమెరుపు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక సంక్షేమ పథకాలు అమలైన సంవత్సరంగా 2020 నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఏపీలో వాలంటీర్లకు జగన్ సర్కార్ భారీ షాక్- 35 ఏళ్లు దాటితే ఇంటికే- తొలగింపుకు ఆదేశం
ఏడాది పొడవునా పథకాల పందేరం
ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం ప్రారంభించిన అమ్మఒడి పథకంతో మొదలైన పథకాల పందేరం ఈ నెల 25న ప్రభుత్వం పంపిణీ చేయాలని భావిస్తున్న ఇళ్ల స్దలాలతో పూర్తయ్యేలా కనిపిస్తోంది. ఇందులో పలు కీలక పథకాలు విద్యార్ధులు, బడుగు బలహీన వర్గాలు, బీసీలు, మహిళలు, చిన్నారులు, తల్లులు, ఆటో డ్రైవర్లు, టైలర్లు, క్షురకులు, రైతులు ఇలా ఎన్నో వర్గాలకు మేలు చేసేవి ఉన్నాయి. కులాల వారీ కార్పోరేషన్లతో పాటు ప్రభుత్వ పథకాల్లో, నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు, విద్య, వైద్య రంగాల్లో పెను మార్పులు చేపట్టే పథకాలు ఎన్నో వీటిలో ఉన్నాయి. ఒకే ఏడాదిలో ఇన్ని పథకాలు అమల్లోకి తీసుకురావడం రాష్ట్ర చరిత్రలోనూ ఇదే తొలిసారి కావడం విశేషం. ప్రభుత్వం ఈ ఏడాది కాలంలో చేసిన అబివృద్ధిపై అభ్యంతరాలున్నా సంక్షేమ పథకాల విషయంలో మాత్రం మంచి మార్కులే పడ్డాయని చెప్పవచ్చు.
కీలక పథకాలతో పెరిగిన మైలేజ్
ఈ ఏడాది వైసీపీ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన పలు సంక్షేమ పథకాలు ప్రజల్లో ఆ పార్టీకి, ప్రభుత్వానికి మంచి మైలేజ్ తెచ్చిపెట్టాయి. వీటిలో రాష్ట్రంలో అక్షరాస్యత రేటు పెంపుకు ఉద్దేశించిన జగనన్న అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు విద్యార్ధులకు ఎంతో ఉపయోగపడ్డాయి. రైతుల కోసం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం, కాపు మహిళలకు కాపునేస్తం, చేనేత నేస్తం, బీసీ కులాల కార్పోరేషన్లు, చిరు వ్యాపారులకు జగనన్న తోడు పథకాలు ఆయా వర్గాల్లో ప్రభుత్వానికి మైలేజ్ పెంచాయనే చెప్పవచ్చు. ఇక జగన్ తన తండ్రి వైఎస్సార్ బ్రాండ్ స్కీమ్ అయిన ఆరోగ్యశ్రీని సైతం ఈ ఏడాది కొత్తపుంతలు తొక్కించారు. క్రమంగా ఒక్కో జిల్లాకు విస్తరించుకుంటూ పోవడంతో పాటు వ్యాధుల సంఖ్య పెంచడం, ఇతర రాష్ట్రాల్లో చికిత్సకు కూడా అనుమతించడం పేదల్లో భరోసా నింపాయి.
సామాజిక న్యాయం దిశగా...
సమాజంలో అన్ని వర్గాలూ కలిసి ముందడుగు వేసినప్పుడే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇదే కోణంలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు సామాజిక వర్గాల కోసం పలు పథకాలను అందుబాటులోకి తెచ్చింది. నామినేటెడ్ పదవులు, పనుల్లో సైతం వీరికి రిజర్వేషన్లు అమలు చేస్తోంది. ఇందులో కాపు సామాజిక వర్గ మహిళల కోసం కాపు నేస్తం పేరుతో కొత్త పథకం తీసుకొచ్చింది. పాస్టర్లు, ఇమామ్లు, అర్చకులకు నెలవారీ గౌరవ వేతనం ఇస్తోంది. నాయీ బ్రహ్మణులకు ఏడాదికోసారి 10వేలు సాయం అందిస్తోంది. దీంతో సామాజిక వర్గాల్లో వెనుకబాటు తనాన్ని ఎంతో కొంత స్ధాయిలో రూపుమాపే అవకాశం దక్కుతోంది.
కరోనాలోనూ ఆగని పథకాలు...
కరోనా ప్రభావంతో రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఆర్ధిక వ్యవస్ద తలకిందులైంది. రెవెన్యూ లోటు పెరిగిపోతోంది. కేంద్రం నుంచి సాయం అందకపోగా, విభజన హామీలు అమలుకాక రాష్ట్రం తల్లడిల్లుతోంది. ఇలాంటి సమయంలో బయటి నుంచి అప్పులు పుట్టడం కూడా గగనమైపోయింది. అయినా వైసీపీ ప్రభుత్వం మాత్రం కరోనాలోనూ ఎక్కడా ఏ పథకాన్నీ ఆపలేదు. కేంద్రం ఇచ్చిన షరతులను అమలు చేసి మరీ సంక్షేమ పథకాలకు ఏలోటూ రాకుండా చూడగలిగింది. దీంతో కరోనా కారణంగా అన్ని రాష్ట్రాల్లో పథకాలపై ప్రభావం పడగా.. ఏపీలో మాత్రం ఎలాంటి ఇబ్బందీ తలెత్తలేదు.
అయినా కొన్ని వర్గాల్లో అసంతృప్తి...
రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నా ఏదో మూల అసంతృప్తి కనిపిస్తూనే ఉంది. నవరత్నాల్లో భాగంగా ఈ ఏడాది రెండోసారి పింఛన్ పెంపు అమలు కావాల్సి ఉండగా.. ప్రభుత్వం నిధుల కొరతతో దాన్ని వచ్చే ఏడాదికి వాయిదా వేసింది. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇళ్ల స్ధలాల పంపిణీ కార్యక్రమం కూడా ఏడాది పొడవునా ఏదో ఒక కారణంతో వాయిదా పడుతూనే వస్తోంది. తాజాగా డిసెంబర్ 25న ఈ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు సంక్షేమ పథకాల లబ్దిదారుల జాబితాలోనూ వందలాది మందిని తొలగించడం, అర్హులు కాదని చెప్పడంతో సదరు వర్గాల్లో అసంతృప్తి కనిపిస్తోంది.