Year Ender 2023: ఈ ఏడాది పతాకస్ధాయికి జగన్-చంద్రబాబు పోరు-మధ్యలో పవన్ కు లాభం?
ఏపీలో ఈ ఏడాది రాజకీయంగా సీఎం వైఎస్ జగన్ కూ, విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబుకు బాగా గుర్తుండిపోతుంది. ఎందుకంటే వీరిద్దరి మధ్య పోరు ఈ ఏడాది పతాకస్ధాయికి చేరింది. ముఖ్యంగా ఇది చంద్రబాబును అరెస్టు చేసి జైలుకు పంపేదాకా వెళ్లడంతో ఇరు పార్టీల మధ్య వైరం ఓ రేంజ్ కు వెళ్లిపోయింది. అయితే ఇది పీక్ లో ఉన్న తరుణంలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ జనసేనకు ఊహించని మైలేజ్ ఇచ్చింది. ఓ దశలో టీడీపీని పవన్ నడిపిస్తున్నాడా అని అనిపించే దాకా ఇది వెళ్లింది.
చంద్రబాబు-జగన్ వైరానికి రాష్ట్ర విభజనకు ముందే బీజాలు పడినా తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏపీలో ముఖాముఖీ రాజకీయాలు చేయాల్సిన పరిస్దితుల్లో ఇద్దరూ ప్రత్యర్ధులను దారుణంగా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఇందులో వ్యక్తిత్వ హననాల వరకూ సోషల్ మీడియా ప్రచారాలు కూడా చేసుకున్నారు. ఫైనల్ గా బీజేపీ అండతో 2014లో గెలిచిన చంద్రబాబును అదే బీజేపీకి వ్యతిరేకంగా మార్చడంలో సక్సెస్ అయిన జగన్.. 2019 కల్లా అధికారం అందుకున్నారు. అక్కడి నుంచి చంద్రబాబును టార్గెట్ చేస్తూ వచ్చారు. ఇది కాస్తా ఈ ఏడాది పతాకస్ధాయికి చేరింది.

ఏపీ స్కిల్ స్కాంలో చంద్రబాబును అరెస్టు చేయడం ద్వారా వైఎస్ జగన్ పెద్ద సాహసమే చేశారు. 40 ఏళ్ల రాజకీయంలో ఎన్నడూ అరెస్టులు, జైళ్లూ ఎరగని చంద్రబాబును తొలిసారి జైలుకు పంపి 52 రోజులు రిమాండ్ లో ఉంచగలిగారు. తద్వారా టీడీపీని మానసికంగా దెబ్బతీశారు. అలాగే వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ సడన్ ఎంట్రీతో చంద్రబాబుకు ఆత్మవిశ్వాసం లభించింది. అంతటితో ఆగకుండా టీడీపీ-జనసేన పొత్తు కూడా ప్రకటించి సంచలనం రేపారు. ఇప్పుడు ఇరు పార్టీల నేతలు క్షేత్రస్ధాయిలో మీటింగ్స్ పెట్టుకుని వచ్చే ఎన్నికలకు సిద్దవుతున్నారు.
మరోవైపు చంద్రబాబు అరెస్టుతో తమ వైరాన్ని పతాకస్ధాయిని చేర్చిన జగన్ కు ప్రజల్లో వస్తున్న మార్పు కలవరపెట్టింది. దీంతో చంద్రబాబుకు బెయిల్ లభించాక దూకుడు తగ్గించారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై వైఎస్ జగన్ మాటల దాడి కూడా కాస్త తగ్గించారు. దీంతో ఈ ఏడాదంతా జగన్ వర్సెస్ విపక్షాలుగా సాగిన పోరు ఏడాది చివరికి వచ్చేసరికి కాస్త శాంతించినట్లయింది. మరో రెండు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న తరుణంలో కొత్త ఏడాదిలో తిరిగి ఈ పోరు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications