Year Ender 2023: ఈ ఏడాదీ కొనసాగిన వైసీపీ ఊపు-చంద్రబాబు అరెస్టుతో ఏకమైన టీడీపీ-జనసేన..!
ఏపీలో రాజకీయ పార్టీలకు ఈ ఏడాది దాదాపు విజయవంతమైన ఏడాదిగానే చెప్పుకోవచ్చు. ఈ ఏడాదిలోనూ అధికార వైసీపీ విజయవంతంగా తమ సంక్షేమ అజెండాను అమలు చేయగలిగింది. ముఖ్యంగా బటన్ నొక్కుతూ లక్షల రూపాయల్ని లబ్దిదారుల ఖాతాల్లోకి పంపుతున్న సీఎం జగన్ ఈ ఏడాదీ దాన్ని ఎక్కడా బ్రేకుల్లేకుండా కొనసాగించారు. అదే సమయంలో చంద్రబాబును అరెస్టు చేయడం ద్వారా పరోక్షంగా టీడీపీ-జనసేన ముందస్తు పొత్తుకూ కారణమయ్యారు.
ఏపీలో వైసీపీ సంక్షేమ పాలన ఈ ఏడాదీ నిరాటంకంగా కొనసాగింది. భారీ ఎత్తున ఖర్చవుతున్నా వెరవకున్నా అప్పులు చేసి అయినా సంక్షేమాన్ని అమలు చేస్తూ వైఎస్ జగన్ ప్రజారంజక ముఖ్యమంత్రిగా ఈ ఏడాదీ పేరు తెచ్చుకున్నారు. గతంతో పోలిస్తే రెవెన్యూ పెరగడంతో సంక్షేమ పథకాల అమలు విషయంలో ఈసారి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోయాయి. అయితే ఈ ఏడాది వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో రైతుల్లో మాత్రం ప్రభుత్వంపై కాస్త అసంతృప్తి కనిపిస్తోంది. అయినా రైతుల పథకాలు మాత్రం యథావిధిగానే కొనసాగిస్తుండటం ప్రభుత్వ విజయంగానే చెప్పుకోవచ్చు.

మరోవైపు విపక్ష నేత చంద్రబాబును స్కిల్ స్కాంలో అరెస్టు చేయాలన్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయం విపక్షాలను ఏకం చేసింది. విపక్షాలు టీడీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టులు అంతా చంద్రబాబు అరెస్టును తప్పుబట్టారు. అయితే ప్రభుత్వం మాత్రం తమ దగ్గర ఆధారాలు ఉండటంతో ఆయన్ను 52 రోజుల పాటు రిమాండ్ లో ఉంచగలిగింది. ఓ దశలో చంద్రబాబుకు బెయిల్ వస్తుందా రాదా అన్న చర్చ కూడా సాగింది. అయితే చివర్లో హైకోర్టు ముందుగా మధ్యంతర బెయిల్ ఇచ్చి, ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కూడా ఇచ్చేయడంతో ఉత్కంఠకు తెరపడింది.
మరోవైపు చంద్రబాబు అరెస్టు కారణంగా ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకోవాలని భావించి టీడీపీ-జనసేన ముందుగానే ఏకమయ్యాయి. జైల్లో ఉన్న చంద్రబాబును పరామర్శించేందుకు వెళ్లిన పవన్ కళ్యాణ్.. అక్కడే టీడీపీ-జనసేన కలిసే ఎన్నికలకు వెళ్తాయని ప్రకటించారు. దీంతోపాటు టీడీపీ-జనసేన ఉమ్మడి సమావేశాలు, ఉమ్మడి మ్యానిఫెస్టో ఇలా ప్రతీ విషయంలోనూ కలిసి ముందుకు సాగుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత, విధానపరమైన లోపాలు తమకు కలిసి వస్తాయని విపక్షాలు ఆశగా ఉన్నాయి. వైసీపీ సర్కార్ మాత్రం సంక్షేమ అజెండాతోనే ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది.












Click it and Unblock the Notifications