గుండు కొట్టించుకున్న ఎల్లం, డబ్బులిచ్చిన ప్రియురాలు
హైదరాబాద్: నకిలీ నోట్ల ముఠా నాయకుడు ఎల్లంగౌడ్ను సైబరాబాద్ పోలీసులు మంగళవారం మీడియా ఎదుట ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. కాగా, ఆగస్టు 1న రాత్రి శామీర్పేటలో చోటు చేసుకున్న ఎన్కౌంటర్ అనంతరం అతను ఇరవై రోజుల పాటు కారులోనే నాందేడ్, షిర్డీ, ఢిల్లీ ఇలా అంతటా షికారు చేశాడు. ఓ న్యాయవాది సహకారంతో పోలీసులకు లొంగిపోయాడు. తాను దాడి చేసింది పోలీసుల పైన అని తెలియడంతో ఎల్లంగౌడ్ పారిపోయాడు.
సెల్ ఫోన్ స్విచ్చాఫ్ చేసాడు. సంఘటన స్థలం నుండి కారులో మహారాష్ట్రలోని నాందేడ్కు వెళ్లాడు. వేరే సిమ్ తీసుకొని తన ప్రియురాలికి ఫోను చేసి ఖర్చుల కోసం డబ్బులు కావాలని కోరాడు. ప్రియురాలు రూ.40వేలు తీసుకెళ్లి ఇచ్చింది. ప్రాణాలతో బయటపడినందువల్ల అతను షిర్డీలో గుండు గీయించుకున్నాడు. అలాగే పోలీసులు గుర్తుపట్టకుండా ఉంటుందని కూడా భావించాడు.
అనంతరం కారులో ఢిల్లీ వెళ్లాడు. ఇలా ఇరవై రోజుల పాటు కారులోనే సంచరించాడు. కొత్త సిమ్ కార్డులు ఉపయోగించడంతో పోలీసులు అతని కదలికలను గుర్తు పట్టలేకపోయారు. అనంతరం శంషాబాద్ ఎన్ కౌంటర్లో శివ మృతి చెందడం.. పోలీసులు తన ఇంటికి వెళ్లి లొంగిపోయేందుకు రాయబారం పంపించడంతో లొంగిపోయాడు.
సహచరుల హత్యకు కుట్ర
ఎల్లంగౌడ్ పైన కర్నాటక, ఆంధ్రల్లో 19 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. కర్నాటకలో నేరాల సమయంలో మధుసూదన్ రెడ్డి, వెంకట్తో ఎల్లంకు విభేదాలు వచ్చాయి. దీంతో వారిని హతమార్చాలని భావించాడు. సిద్దిపేటకు చెందిన ఆటో డ్రైవర్ ముస్తఫాతో పరిచయం ఏర్పడింది. ముస్తఫా నేరచర్తిర కలిగిన వాడు కావడంతో.. అతని సహకారంతో వారిని హతమార్చాలనుకున్నాడు.
ముస్తఫాకు రూ.2 లక్షలు ఇస్తానని చెప్పి వారిని చంపేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంతలోనే శామీర్ పేట ఎన్ కౌంటర్ ఘటన జరిగింది. ఈ ఘటనలో ముస్తఫా హతమయ్యాడు. కాగా, ఎల్లంగౌడ్ సిద్దిపేటలో కొంతకాలం క్రితం స్థిరాస్థి వ్యాపారం ప్రారంభించాడు. పది నుండి పదిహేను లక్షలతో ఓ స్థలం కొనుగోలు చేశాడు. నేరాల ద్వారా రూ.లక్షలు ఆర్జించాడు. రూ.8 లక్షలతో సిద్దిపేటలో దాబా కట్టించాడు.