బెజవాడలో భవిష్యత్ రాజకీయం వారిదే- వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న ఇద్దరు...
ఏపీలో రాజకీయ అధికార కేంద్రంగా ఉన్న వాణిజ్య రాజధాని విజయవాడలో రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. గతంలో దేవినేని వర్సెస్ వంగవీటిగా సాగిన రాజకీయాలు తాజాగా మరో మలుపు తీసుకున్నాయి. ఈసారి దేవినేని వర్సెస్ కేశినేనిగా సాగుతున్న రాజకీయాల్లో ఇద్దరు రాజకీయ దిగ్గజ కుటుంబాల వారసులు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్దమవుతున్నారు. వీరిలో ఎవరు విజయం సాధించినా, ఎవరు వెనుకబడినా రాజకీయం మాత్రం రాష్ట్రం దృష్టిని ఆకర్షించడం ఖాయంగా కనిపిస్తోంది.
దేవినేని, కేశినేని కుటుంబాల వారసులు..
బెజవాడ రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు దేవినేని నెహ్రూ. టీడీపీలో ఉన్నా కాంగ్రెస్ లో ఉన్నా విజయవాడ రాజకీయాలపై నెహ్రూ వేసిన ముద్ర చెరగరానిది. ఎన్టీఆర్ టీడీపీని స్ధాపించినప్పడు రాజకీయాల్లో చేరిన నెహ్రూ.. ఆయన కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు.. ఎన్టీఆర్ ఉన్నంతవరకూ టీడీపీలో, ఆ తర్వాత వైఎస్ తో కలిసి కాంగ్రెస్ లో మళ్లీ టీడీపీలో పనిచేసిన నెహ్రూ రెండేళ్ల క్రితం మరణించారు. నెహ్రూ కాంగ్రెస్ లో ఉండగానే విజయవాడ ఎంపీగా పోటీ చేసిన ఆయన కుమారుడు అవినాష్..ఆ తర్వాత టీడీపీలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. గతేడాది ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత వైసీపీలో చేరిన అవినాష్.. ప్రస్తుతం ఆ పార్టీకి విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా ఉన్నారు.
మరోవైపు స్ధానిక టీడీపీ ఎంపీ కేశినేని నాని కూతురు శ్వేత తాజాగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగి విజయవాడ నగరపాలకసంస్ధ ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకుంటున్నారు. అయితే ఆమె గత రెండు పార్లమెంటు ఎన్నికల్లో తండ్రి కేశినేని నాని విజయం కోసం ప్రచారం నిర్వహించారు.
వంగవీటి వర్సెస్ దేవినేని వర్సెస్ కేశినేని...
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ రాజకీయాల్లో వంగవీటి రంగా, దేవినేని నెహ్రూ వర్గాల మధ్య వర్గపోరు నడిచేది. అప్పట్లో సై అంటే సై అనుకునే వరిస్ధితి ఈ రెండు కుటుంబాల మధ్య ఉండేది. అయితే ఈ పోరు కీలక దశలో ఉన్న సమయంలో వంగవీటి రంగాను ప్రత్యర్ధులు నరికి చంపారు. ఈ హత్యకు దేవినేని వర్గీయులే కారణమని ఇప్పటికీ భావించే వంగవీటి వారసుడు రాధా.. దేవినేని కుటుంబంతో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు. గత ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన సందర్భంలో మాత్రం ఓ వ్యక్తి చేసిన పనిని పార్టీకి ఆపాదించలేమని చెప్పి టీడీపీకి క్లీన్ చిట్ ఇచ్చేశారు. దీంతో టీడీపీలో దేవినేని వారసుడు అవినాష్ తో కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యారు. అయితే వంగవీటి వర్గంతో పోరు సమసి పోయిందనుకుంటున్న తరుణంలో దేవినేని వారసుడు అవినాష్ కు కేశినేని రూపంలో టీడీపీలో ప్రత్యర్ధి ఎదురయ్యారు. దీంతో ఆయన తాజాగా టీడీపీని వీడి వైసీపీలో చేరిపోయారు. ఈ చేరికతో విజయవాడలో పోరు కేశినేని వర్సెస్ దేవినేనిగా మారిపోయింది.
అవినాష్, శ్వేత ఇద్దరూ ఇద్దరే...
దేవినేని అవినాష్, కేశినేని శ్వేత ఇద్దరూ రాజకీయాల్లోకి ప్రవేశించిన సమయం, సందర్బం వేరు కానీ ఇద్దరి మధ్య ఎన్నో సారూప్యతలు ఉన్నాయి. ఇందులో కులం, కుటుంబ వారసత్వం, స్ధానబలం, ప్రధానమైనవి. కమ్మ సామాజికవర్గ రాజకీయాలకు ప్రధాన కేంద్రమైన విజయవాడ నగరంలో అవినాష్, శ్వేత ఇద్దరికీ ఘనమైన నేపథ్యం ఉంది. దేవినేని, కేశినేని కుటుంబ వారసులుగా బెజవాడ రాజకీయాల్లో కొనసాగుతున్న వీరిద్దరూ ప్రస్తుతానికి వేర్వేరు పదవులు, పార్టీల్లో ఉన్నా... వచ్చే ఎన్నికల నాటికి ముఖాముఖీ తలపడే పరిస్ధితి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
బెజవాడలో భవిష్యత్ వీరిదే...
విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ ఇన్ ఛార్జ్ గా ఉన్న అవినాష్, టీడీపీ తరఫున రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న శ్వేత 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల నాటికి అవే పార్టీల్లో ఉంటే.. అసెంబ్లీ లేదా పార్లమెంటు బరిలో ప్రత్యర్ధులుగా తలపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం వైసీపీకి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఇన్ చార్జ్ గా ఉన్న అవినాష్ ను భవిష్యత్తులో అవసరమైతే విజయవాడ ఎంపీ సీటు నుంచి వైసీపీ బరిలోకి దింపే అవకాశాలు లేకపోలేదు. అదే సమయంలో తండ్రి కేశినేని నాని రెండు పర్యాయాలు ఎంపీగా పని చేసిన తర్వాత కూతురికి అవకాశం ఇవ్వాలనుకుంటే శ్వేత కూడా ఎంపీ బరిలో ఉంటారు. దీంతో వీరిద్దరి మధ్య అమీతుమీ తప్పకపోవచ్చు. కాబట్టి ఈ ఇద్దరు రాజకీయ కుటుంబ వారసులను విజయవాడ భవిష్యత్ రాజకీయాలను శాసించే యువనేతలుగా ప్రస్తుతం అంతా చర్చించుకుంటున్నారు.