ప్రియురాలు ఫోన్ తియ్యలేదని ప్రేమికుడి ఆత్మహత్య
పశ్చిమగోదావరి: ప్రియురాలు తనతో ఫోన్లో మాట్లాడటంలేదన్న క్షణికావేశంలో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా గొల్లమాలపల్లిలో గ్రామంలో చోటుచేసుకుంది. ప్రేయసి తనను నిర్లక్ష్యం చేస్తుందన్న అనుమానంతో యువకుడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం కె.ఇల్లిందలపర్రుకు చెందిన వింజేటి నవీన్ (21), గొల్లమాలపల్లికి చెందిన యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. నవీన్, ఆ యువతి బంధువులే కావడం పైగా నవీన్ కు ఆ యువతి అక్క కూతురు వరసే కావడంతో ఇరువర్గాల పెద్దలు కూడా వీళ్ల పెళ్లికి అంగీకరించినట్లు తెలుస్తోంది.
అయితే నవీన్ ప్రేమిస్తున్నయువతి తల్లి ఉపాధి నిమిత్తం గల్ఫ్కు వెళ్లి అక్కడే ఉంటోంది. అయితే ఇటీవలే ఆమె తన స్వగ్రామం గొల్లమాలపల్లిలో సొంత ఇల్లు నిర్మాణం చేపట్టింది. ఈ ఇంటి పనులు కూడా నవీనే దగ్గరుండి చేయిస్తున్నాడు. అయితే వీరి మధ్య ఏమైనా పొరపొచ్చాలు వచ్చాయో, ప్రియురాలు ఫోన్ చూసుకోలేదో కానీ...సోమవారం రాత్రి నవీన్ తాను ప్రేమించిన యువతికి ఫోన్ చేయగా ఆమె ఫోన్ ఎత్తలేదు.
దీంతో ఆగ్రహించిన నవీన్ తీవ్ర ఉద్రేకానికి లోనై వెనువెంటనే గొల్లమాలపల్లికి చేరుకొని...తాను ఫోన్ చేస్తే ఎందుకు ఎత్తలేదని ఆ యువతిని నిలదీస్తూ వాగ్వాదానికి దిగాడు. అసలు తాను చనిపోతేకాని బుద్ది రాదంటూ ఉరేసుకుంటానని బెదిరించాడు. దీంతో ఆ యువతి భయపడి బంధువులను పిలుచుకొచ్చేందుకు వెళ్లింది. అనంతరం ఆమె బంధువులతో కలసి తిరిగి వచ్చేసరికే నవీన్ చున్నీతో ఉరివేసుకుని మరణించి ఉన్నాడని యువతి చెబుతోంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.