కరోనాతో యువ జర్నలిస్టు పామర్తి పవన్ మృతి...
కరోనా మహమ్మారి కాటుకు జర్నలిస్టులు పిట్టల్లా రాలిపోతున్నారు. గత కొద్దిరోజులుగా వరుసగా జర్నలిస్టుల మరణాలు వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా పామర్తి పవన్ కుమార్(38) అనే యువ జర్నలిస్టు కరోనాతో మృతి చెందారు. ఎలక్ట్రానిక్ మీడియాలో పవన్ బిజినెస్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం కరోనా బారినపడిన ఆయన కృష్ణా జిల్లా వుయ్యూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం(మే 14) మృతి చెందారు. కరోనాతో తండ్రి చనిపోయిన 20 రోజులకే పవన్ కూడా మృతి చెందారు.
కరోనా సోకిన తర్వాత ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో పవన్ వుయ్యూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. అప్పటికే పవన్ ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని వైద్యులు చెప్పారు. మెరుగైన వైద్యం కోసం విజయవాడ లేదా హైదరాబాద్కు తరలించమని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ ఇంతలోనే శుక్రవారం తెల్లవారుజామున పవన్ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో పరిస్థితి విషమించి మృతి చెందాడు.
పవన్ పలు తెలుగు న్యూస్ ఛానెళ్లలో పనిచేశారు. ఆయన రాసిన కథనాలకు జాతీయ స్థాయి అవార్డులు కూడా వచ్చాయి. పవన్ స్వస్థలం కృష్ణా జిల్లా మొవ్వ మండలం గూడపాడు గ్రామం. ఆయనకు భార్య మధు శ్రావణి, పదేళ్ల లోపు వయసున్న ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఐదు రోజుల క్రితం ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ గోపి కూడా కరోనాతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. కరోనా సోకి ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్లో పనిచేసే గోపీ అనే మరో రిపోర్టర్ కూడా కొద్దిరోజుల క్రితం కరోనాతో మృతి చెందారు.
తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు జర్నలిస్టులను ఇప్పటివరకూ ఫ్రంట్ లైన్ వర్కర్స్గా గుర్తించలేదు. దీంతో తెలుగు మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు భద్రత కరువైంది. కనీసం ఇప్పటికైనా జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వర్కర్లుగా ప్రభుత్వాలు గుర్తించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.