ఆ అవమానం భరించలేక యువకుడి ఆత్మహత్య..
గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణంలో చరణ్ రాజే అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికంగా ఓ టీవి చానెల్లో జర్నలిస్టుగా పనిచేస్తున్న చరణ్ రాజు ఆత్మహత్య స్థానికంగా కలకలం రేపింది. అయితే చరణ్ రాజు ఆత్మహత్యకు అతని స్నేహితులే కారణమని తేలింది. వాళ్లు చేసిన పనికి తాను పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి రావడంతో.. అవమాన భారంతో అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళ్తే.. తాడేపల్లికి చెందిన చరణ్ రాజు స్థానికంగా ఓ టీవి చానెల్లో జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. ఈ నెల 24వ తేదీ రాత్రి చరణ్ రాజు విజయవాడలోని చర్చికి వెళ్లాడు. అక్కడికి వెళ్లేముందు తన బైక్ను స్నేహితులకు ఇచ్చాడు. అయితే ఆరోజు రాత్రి బైక్పై విజయవాడ వెళ్లిన అతని స్నేహితులు ఓ యువతిని ఈవ్ టీజింగ్ చేశారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. బైక్ నంబర్ ఆధారంగా వారు దర్యాప్తు చేశారు.
చరణ్ రాజును అదుపులోకి తీసుకుని రోజంతా పోలీస్ స్టేషన్లో ఉంచి విచారించారు. చివరకు ఈవ్ టీజింగ్లో చరణ్ పాత్ర లేదని తేలడంతో అతన్ని వదిలిపెట్టారు. అయితే ఇదంతా అవమానంగా భావించిన చరణ్ రాజు గురువారం రాత్రి తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.