ప్రియురాల్ని రైలు కిందకు తోసేశాడు, రెండు కాళ్లు కోల్పోయిన యువతి
విజయనగరం: ఏపీలోని విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరం ఆత్మహత్య చేసుకుందామని చెప్పి ఓ ప్రియుడు తన ప్రియురాలిని రైలు కింద తోసేసిన సంఘటన జరిగింది. ఈ ఘటనలో ఆమె రెండు కాళ్లు పోయాయి. ఆమెను తొలగించుకునే ఉద్దేశ్యంలో భాగంగా రైలు కిందకు తోసేశాడు.
రామకృష్ణ, నీలవేణి అనే ఇద్దరు ప్రేమించుకున్నారు. నీలవేణి పెళ్లి చేసుకోమని అడిగింది. అయితే తాను పెళ్లి చేసుకోవాలంటే రూ.10 లక్షలు ఇవ్వాలని, డబ్బులు ఇస్తే పెళ్లి చేసుకుంటానని చెప్పాడని, నీకు ఇష్టం వచ్చిన దగ్గర ఉంచుతానని చెప్పాడు.
రెండు కాళ్లు కోల్పోయిన బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలు ఈ విషయమై చెప్పారు. ఆదివారం నాడు వెళ్లి తాను పెళ్లి గురించి అడిగితే, తనకు సంబంధం లేదని చెప్పాడని, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోమని అన్నాడని చెప్పింది.
పది లక్షల రూపాయల కట్నం ఇస్తానంటే పెళ్లి చేసుకుంటానని చెప్పాడని తెలిపింది. ఇద్దరం ఆత్మహత్య చేసుకుందామని చెప్పిన ప్రియుడు ఆమెను చీపురుపల్లి రైల్వే స్టేషన్ తీసుకు వెళ్లాడు. మాట్లాడుకుందామని చెప్పి రప్పించాడు. ఆ తర్వాత ఇరువురం కలిసి ఆత్మహత్య చేసుకుందామని చెప్పాడని తెలుస్తోంది.
ఇరువురు ప్లాట్ ఫాం పైన ఉన్నారు. అంతలోనే రైలు రావడం చూసిన రామకృష్ణ.. నీలవేణిని పట్టాలపైకి తోసేశాడు. దీంతో ఆమె రెండు కాళ్లు పోయాయి. గమనించిన ప్రయాణీకులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.