జగన్ కోసం 'సిద్ధం' అంటున్న వైఎస్ భారతి!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని మేమంతా సిద్ధం సభలతో, బస్సు యాత్రలతో హోరెత్తిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. ఇక ఇదే సమయంలో వైయస్ జగన్ కోసం నేను సైతం సిద్ధం అంటూ ఆయన సతీమణి వైయస్ భారతి ఎన్నికల ప్రచారానికి రెడీ అవుతున్నారు.
రంగంలోకి దిగనున్న వైఎస్ భారతి
ఏపీలో ఈనెల 18న ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఈనెల 25వ తేదీన పులివెందులలో వైయస్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక ఈ క్రమంలో పులివెందుల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార బాధ్యతలని వైయస్ భారతి తన భుజస్కందాల మీద వేసుకోనున్నారు. వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయాల్సిన నేపథ్యంలో, ఆమె పులివెందులలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.

ఎన్నికలు పూర్తయ్యేదాకా అక్కడే తిష్ట
ఎన్నికలు పూర్తయ్యే వరకు పులివెందులలోనే ఉండి భారతి, విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి వైయస్ జగన్ కు మెజారిటీ తీసుకురావడానికి కృషి చేయనున్నారు. వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తిగా భారతికి మంచి పేరుంది. కడప యాసలో ప్రతి ఒక్కరితో కలుపుకు పోయే స్వభావమున్న భారతి పట్ల పులివెందుల నియోజకవర్గ ప్రజలు మంచి ఆదరణ చూపిస్తారని వైసిపి నేతలు బలంగా నమ్ముతున్నారు.
భారతి ప్రచారానికి ఆ చరిష్మా ఉపయుక్తం.. వైసీపీ యోచన
ఈ క్రమంలోనే భారతి పులివెందుల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. అంతేకాదు భారతి తండ్రి దివంగత ఈసీ గంగిరెడ్డికి స్థానికంగా మంచి పేరుంది. ఆయన కుమార్తెగా కూడా భారతికి స్థానికంగా గుర్తింపు ఉంది. ఎంతో మందికి వైద్య సేవలు అందించిన వైద్యుడిగా డాక్టర్ ఈసీ గంగిరెడ్డిని అక్కడివారు బాగా అభిమానిస్తారు. ఇక ఈ చరిష్మా అంతా భారతి ప్రచారానికి ఉపయోగపడుతుందని వైసిపి భావిస్తుంది.
భర్త లక్ష్యసాధన కోసం రంగంలోకి భార్య భారతి
ఎన్నికల సమయంలో అనేక సందర్భాలలో భారతి జగన్ కోసం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పులివెందులలో భారీ మెజారిటీ సంపాదించాలని వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్న క్రమంలో, భర్త లక్ష్యసాధన కోసం రంగంలోకి భార్య భారతి దిగబోతున్నట్టుగా తెలుస్తుంది.












Click it and Unblock the Notifications