వైయస్ జగన్ బొం'కారు': ఈసికి టిడిపి ఫిర్యాదు
హైదరాబాద్: తనకు కారు కూడా లేదంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బొంకారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు సోమవారం మీడియాలో వార్తలు వచ్చాయి. వాహనాల విషయంలో వైఎస్ జగన్ తప్పు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. అఫిడవిట్లో వాహనాలకు సంబంధించిన వివరాలు చెప్పాల్సిన చోట జగన్ 'లేవు' అని చెప్పారు. మీడియా కథనాల ప్రకారం - జగన్ పేరిట రెండు వాహనాలున్నట్లు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ రికార్డుల్లో స్పష్టంగా ఉంది.
ఒకటి - విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న బాగా ఖరీదైన బీఎం డబ్ల్యూ-ఎక్స్5. ఈ నల్లరంగు కారు నెంబర్ ఏపీ 09 బీఎన్ 2345. హైదరాబాద్ సెంట్రల్ జోన్ (ఖైరతాబాద్)లో 2008 మార్చి 4వ తేదీన 'వైఎస్ జగన్ మోహన్ రెడ్డి' పేరిట ఇది రిజిస్టర్ అయ్యింది. ఈ రిజిస్ట్రేషన్ ఇప్పటికీ 'యాక్టివ్'గానే ఉన్నట్లు రవాణా శాఖ వెబ్సైట్ చెబుతోంది.
మరోటి - స్కార్పియో వాహనం. జగన్ పేరు మీద ఉన్న దీని నెంబర్ ఏపీ09బీవీ1229. ఇది కూడా నల్లరంగు వాహనమే. ఈ స్కార్పియోను ఖైరతాబాద్ ఆర్టీయే ఆఫీసులో 2009 ఆగస్టు 28వ తేదీన రిజిస్టర్ చేశారు. యజమాని పేరు 'జగన్ మోహన్ రెడ్డి ఎడుగూరి సందింటి' అని స్పష్టంగా పేర్కొన్నారు. నిజానికి 2009 ఎన్నికల సమయంలోనూ జగన్ తన పేరిట వాహనాలు లేవని తప్పుడు ప్రమాణ పత్రం సమర్పించారు.
ఆయన పేరిట రిజిస్టరైన వాహనం హైదరాబాద్లో పరిమితికి మించిన వేగంతో ప్రయాణిస్తుండగా... ట్రాఫిక్ పోలీసులు గుర్తించి ఈ-చలాన్ కూడా పంపించారు. తన పేరిట రెండు వాహనాలున్నప్పటికీ.. 'ఏమీ లేవు' అని జగన్ మరోసారి అదే తప్పుడు అఫిడవిట్ సమర్పించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రవాణా శాఖ వెబ్సైట్లో, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వెబ్సైట్లలో నెంబర్ కొడితే యజమాని ఎవరో ఇట్టే తెలిసిపోతుంది. దీనిపై తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడానికి సమాయత్తమవుతోంది.