బాబు హామీలను తుంగలో తొక్కారు: జగన్
అనంతపురం: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుంగలో తొక్కారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతు భరోసా యాత్రలో భాగంగా మంగళవారం నాడు అనంతపురంలో పర్యటించిన ఆయన అక్కడి ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపారు.
కార్మికుల సమ్మెకు వైసీపీ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్న 43 శాతం ఫిట్మెంట్ న్యాయబద్ధమైనదన్నారు.
అనంతపురం జిల్లా పుట్లూరు మండలం ఎల్లుట్లలో జగన్ మల్లికార్జున కుటుంబాన్ని పరామర్శించారు. అన్ని విధాల అండగా ఉంటానని ఆయన వారికి హామీ ఇచ్చారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తగా పనిచేసిన మల్లికార్జున గత ఏడాది హత్యకు గురయ్యారు. మల్లికార్జున కుటుంబాన్ని ఓదార్చిన తర్వాత వైయస్ జగన్ అక్కడి నుంచి వేపచెర్లకు బయలుదేరారు.
వైయస్ జగన్ గత రెండు రోజులుగా అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు.