నడి రోడ్డుపై టీ తాగుతూ, బన్ తింటూ జగన్, 'ఇంటికి కిలో బంగారం అంటాడేమో'
Recommended Video
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అనంతపురం జిల్లాలో మంగళవారం కొనసాగుతోంది. 27వ రోజు చేరుకున్న ఆయన పాదయాత్ర అనంతపురంలో రెండో రోజు. ప్రజలతో మమేకం అవుతూ ముందుకు వెళ్తున్నారు.
జగన్ మహనీయుడు కానీ: ప్రశంసిస్తూనే మమత షాక్, పార్టీకి గుడ్బై, ఎందుకంటే?
మంగళవారం గుత్తిలో పాదయాత్ర ప్రారంభించిన జగన్ గుత్తి, అనంతపురం, ఆలంపల్లి క్రాస్ మీదుగా యాత్ర కొనసాగిస్తున్నారు. అందరినీ పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.
అభిమాని ఇచ్చిన టీ తాగుతూ, బ్రెడ్ తింటూ జగన్
గుత్తి శివారులో ఓ అభిమాని వైయస్ జగన్ వద్దకు వచ్చి టీ, బన్ ఇచ్చారు. దానిని జగన్ ఆప్యాయంగా తీసుకున్నారు. టీలో ఆ బ్రెడ్డును ముంచుకొని తిన్నారు. అతడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు రైతులతో మాట్లాడారు. గుత్తి పెద్ద చెరువును అభివృద్ధి చేసి స్థిరీకరించాలని కోరగా, అధికారంలోకి రాగానే సమస్యలను తీరుస్తానని జగన్ చెప్పారు.
ఇంటికో కిలో బంగారం అంటాడేమో
జగన్ తన పాదయాత్రలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మండిపడుతున్నారు. ఎన్నికల హామీల్లో చంద్రబాబు ఏ ఒక్కటీ నెరవేర్చలేదని, ఈసారి గతం కంటే అదిరిపోయేలా ఇంటికి కిలో బంగారం, కారు, భారీ హామీల మేనిఫెస్టోతో ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు.
పైన చంద్రబాబు తింటున్నారు
ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పులు రావాలని, నాయకులు మాటపై నిలవలేకపోతే పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోయేలా ఉండాలని జగన్ అన్నారు. చంద్రబాబు పైన తింటుంటే, గ్రామాల్లో జన్మభూమి కమిటీలు దోచేస్తున్నాయనీ, పింఛను, బియ్యం, చివరకు మరుగుదొడ్డి కావాలన్నా లంచాలు ఇవ్వాల్సిన దుస్థితి ఉందన్నారు.
ఇప్పటికి మూడుసార్లు తీర్మానం
చంద్రబాబు ప్రతి కులాన్నీ మోసం చేస్తున్నారని జగన్ విమర్శించారు. బోయలను ఎస్టీల్లో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశామనీ, దీనిని కేంద్రానికి పంపుతున్నామని ప్రకటించారన్నారు. ఇదే విషయంలో ఇప్పటికి మూడుసార్లు తీర్మానం చేసి పంపారని మండిపడ్డారు. బోయ, కురబ, కాపులను ఇలాగే మోసం చేస్తున్నారంటూ ఆరోపించారు.
ప్రతి గ్రామంలో సచివాలయం
వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి గ్రామంలో పది మందితో గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తామనీ, గ్రామీణులకు ఏది కావాలన్నా 72 గంటల్లో మంజూరు చేస్తామని జగన్ అన్నారు. పేద పిల్లలను ఇంజినీరింగ్, డాక్టర్ వంటి ఉన్నత చదువులు చదివించడమే కాకుండా, హాస్టల్ బిల్లులు, మెస్ ఛార్జీల కింద రూ.20 వేలు చొప్పున ఇస్తామన్నారు.
బాబు మేనిఫెస్టోలో లావుగా ఉండదు
చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టో లావుగా ఉంటుందనీ, వైసీపీది మాత్రం మూడు, నాలుగు పేజీలే ఉంటుందని జగన్ అన్నారు. అందులో హామీలన్నీ కచ్చితంగా నెరవేరుస్తామన్నారు. జనం చెబుతున్న సమస్యలు వింటుంటే తనకు బాధేస్తోందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉండేవన్నారు. అన్నీ అబద్దాలే చెబుతున్న చంద్రబాబు వంటి నాయకుడు అవసరమా అని ప్రశ్నించారు.