చంద్రబాబును లాగి చెంప దెబ్బ కొడుతారు: జగన్, చేతులు జోడించి మొక్కుతున్నా: మాణిక్యాలరావు
హైదరాబాద్: విజయవాడలోని మాఫియా ముఠాను కాపాడడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవస్థలు పడుతున్నారని ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాల్ మనీపై చర్చ సందర్భంగా ఆయన శుక్రవారం సాయంత్రం శాసనసభలో ఆ వ్యాఖ్యలు చేశారు.
ఫోన్ కొడితే ఐదు నిమిషాల్లో మహిళలను కాపాడుతామనే మాట నీటి మూటే అయిందని ఆయన అన్నారు. డ్వాక్రా మహిళలకు తగిన రుణాలు ఇవ్వకపోవడం వల్లనే వారు అధిక వడ్డీలకు తీసుకుని మాఫియా ముఠా చేతిలో చిక్కుకున్నారని ఆయన అన్నారు. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన రుణాలను ఇవ్వడంలో చంద్రబాబు ప్రభుత్వం ఎలా విఫలమైందో ఆయన చెప్పే సమయంలో మంత్రి మృణాళిని జోక్యం చేసుకుని డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం అందించిన సహాయాన్ని వివరించారు.
మంత్రి మాట్లాడిన తర్వాత - డ్వాక్రా మహిళల వద్దకు వెళ్తే చంద్రబాబును లాగి చెంపదెబ్బ కొడుతారని జగన్ అన్నారు. అధిక వడ్డీలకు మహిళలు అప్పు తెచ్చుకుని, చెల్లించలేని స్థితిలో పడిన మహిళలను శాశ్వత వ్యభిచారులుగా మార్చే దారుణం చోటు చేసుకుందని ఆయన అంతకు ముందు అన్నారు. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీలను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు.

కాల్ మనీ చర్చను తప్పు దారి పట్టించాలని జగన్ చూస్తున్నారని మంత్రి మాణిక్యాల రావు అన్నారు. చేతులు జోడించి చెబుతున్నానని ఆయన అన్నారు. కాల్ మనీ వ్యవహారాన్ని శాసనసభ యావత్తు ఏకగ్రీవంగా ఖండించాలని ఆయన అన్నారు. సభలో కూర్చుని వెకిలి నవ్వుకుంటూ ఉంటే మంచిది కాదని ఆయన అన్నారు. మనందరినీ దోషులుగా ప్రజలు చూసే పరిస్థితి ఉందని ఆయన అన్నారు. ప్రజలు ఏవగించుకోకుండా ఉండాలంటే సభ ఏకతాటి మీద ఉండాలని ఆయన అన్నారు.
రాజకీయ నాయకుడితో ఓ ఫొటోను చూపించి, అదే నిజమైనట్లుగా మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. ప్రజల ఏహ్యభావం మన మీదికి రాకుండా చూసుకోవాలని ఆయన అన్నారు. తాను చెప్పేది జాగ్రత్తగా వింటే మీరు తెలుగుదేశం కండువా కప్పుకుని ఈ విధంగా మాట్లాడుతున్నారో అర్థమవుతుందని ఆయన అన్నారు.
కాల్ మనీ అత్యంత ముఖ్యమైన విషయమని, కొంత మంది మహిళలపై అత్యాచారాలకూ లైంగిక వేధింపులకూ పాల్పడ్డారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. కాల్ మనీ వ్యవహారంలో 65 మంది వైసిపివాళ్లు, 20 మంది టిడిపి వాళ్లు, 12 మంది కాంగ్రెసు వాళ్లు ఉన్నారని ఆయన చెప్పారు. కాల్ మనీ వ్యవహారంపై ఓ మహిళ పదో తారీఖున ఫిర్యాదు చేస్తే, అది 12న తన దృష్టికి వచ్చిందని, చర్యలు తీసుకోవాలని ఆదేశించానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications