టీడీపీని బీజేపీకి దగ్గర చేస్తున్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్??
ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో భారతీయ జనతాపార్టీ స్నేహపూర్వకమైన పోరు సాగిస్తోంది. మిత్రపక్షంగా ఉన్న జనసేనతో పొత్తుందో? లేదో? ఇరుపార్టీలకు అర్థంకాని పరిస్థితి. గత ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలతో తెలుగుదేశం పార్టీని బీజేపీ దూరం పెట్టింది. తనకు ఈసారి ఎన్నికల్లో సహకరించకపోయినా పర్వాలేదు.. అడ్డంకులు మాత్రం సృష్టించవద్దని చంద్రబాబు బీజేపీ అధిష్టానాన్ని కోరినట్లు వార్తలు వస్తున్నాయి.
ఆ పార్టీ నుంచి ఎటువంటి సానుకూల సంకేతాలు వెలువడనప్పటికీ అకస్మాత్తుగా బీజేపీ టీడీపీకి స్నేహహస్తాన్ని అందిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి కారణం.. వైసీపీవై వ్యతిరేకతో.. టీడీపీపై సానుకూలతో కాదు.. తెలంగాణ ఎన్నికలు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులిద్దరూ చంద్రబాబుకు వ్యతిరేకులే కావడం గమనార్హం.

40 నియోజకవర్గాల్లో సెటిలర్ల ప్రభావం
తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి, బీజేపీ మదగజాల్లా తలపడుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా రాష్ట్రంలో పాగావేయాలనే పట్టుదలతో ఉన్న కమల దళం అందుకు ఉన్న అన్ని దారులను వినియోగించుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి స్నేహ హస్తం అందించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీనికి కారణం.. సెటిలర్లు. రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లో సెటిలర్ల ప్రభావం 40 నియోజకవర్గాల్లో ఉంటుంది. ఆ మేరకు వారిని బీజేపీవైపు ఆకర్షించాలంటే వారిని ప్రభావవంతం చేయగలిగిన వ్యక్తి చంద్రబాబు ఒక్కరే అనే అభిప్రాయానికి వచ్చారు.

కేసీఆర్ వ్యూహం
ఇటీవల తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పొగడ్తల్లో ముంచెత్తి స్వయంగా నివాళులర్పించారు. సెటిలర్ల ఓట్లను కొల్లగొట్టాలనే కేసీఆర్ వ్యూహాన్నిపసిగిట్టిన బీజేపీ కీలక నేత ఒకరు అధిష్టానానికి ఇక్కడి పరిస్థితిని వివరించారు. సదరు నేత జాతీయస్థాయిలో క్రియాశీలకంగా వ్యవహరిస్తుంటారు.
దీంతో బీజేపీ అధిష్టానం వైఖరిలో మార్పు వచ్చినట్లు భావిస్తున్నారు. వారిని ప్రసన్నం చేసుకుంటే గెలుపుబావుటా ఎగరవేయొచ్చనే యోచనలో ఉన్నారు. దీంతో ఏపీలో ఆ పార్టీపట్ల గణనీయమైన మార్పు వచ్చింది. రాష్ట్రపతి అభ్యర్థిని ద్రౌపది ముర్ము అమరావతి వచ్చిన సందర్భంగా ఆ పార్టీ నేతలతో కూడా ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి టీడీపీకి ఆహ్వానం పంపించారు.

బీజేపీ పట్ల సానుకూల వైఖరితో చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా బీజేపీ పట్ల సానుకూల వైఖరితోనే ఉన్నారు. ఆ దిశగా ఆయన ఇప్పటికే పలు సంకేతాలను ఢిల్లీకి పంపించారు. ఏపీలో తనకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య సుహృద్భావ సంబంధాలుండటంతో ఆయన బీజేపీవైపే మొగ్గుచూపుతున్నారు.
తెలంగాణలో బీజేపీ వెలగాలంటే దాని స్విచ్ ఏపీలో ఉందని అర్థం కావడంతో బీజేపీ రాజకీయం మలుపులు తిరుగుతోంది. ఒకరకంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్ కలిసి టీడీపీని బీజేపీకి దగ్గర చేస్తున్నారనే అభిప్రాయాన్ని సీనియర్ రాజకీయవేత్తలు సైతం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications