సచివాలయ ఉద్యోగులకు జగన్ మరో గుడ్ న్యూస్-EHS పరిధిలోకి-ప్రయోజనాలివే !
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల అమలు కోసం ఏర్పాటుచేసిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు సీఎం జగన్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే వారికి మూడేళ్ల తర్వాత ప్రొబేషన్ ఖరారు చేసిన ప్రభుత్వం ఇప్పుడు వారి ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాలు కల్పించేందుకు సిద్దమవుతోంది. దీనికి సంబంధించి సచివాలయాలశాఖ ఆరోగ్యశ్రీ సీఈవోకు లేఖ పంపింది.
సచివాలయ ఉద్యోగులకు హెల్త్ కార్డులు
ఏపీలో సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. వారి ఆరోగ్య భద్రతకు హామీ ఇస్తూ హెల్త్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డులు ఇస్తుండగా.. వాటి ప్రయోజనాన్ని సచివాలయ ఉద్యోగులకు సైతం వర్తింప జేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఉద్యోగుల నుంచి ఈ మేరకు డిమాండ్ ఉంది. దీంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఆరోగ్య శ్రీ సీఈవోకు సచివాలయాల శాఖ తరఫున ఆదేశాలు పంపారు.
ఈహెచ్ఎస్ లోకి లక్షకు పైగా ఉద్యోగులు
ఈహెచ్ఎస్ పథకం కిందకు సచివాలయ ఉద్యోగుల్నితీసుకురావాలన్న ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు లక్ష మందికి పైగా ఉద్యోగులు ప్రయోజనం పొందబోతున్నారు. ఇప్పటికే ఈ లక్ష మందిలో చాలా మంది ఎలాంటి ఆరోగ్య భద్రత ప్రయోజనాలు పొందడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందడం లేదు. అదే సమయంలో ప్రభుత్వం ఇప్పటివరకూ ఈహెచ్ఎస్ పరధిలోకి తీసుకొచ్చి కార్డులు ఇవ్వకపోవడంతో అటువైపు నుంచి ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో తమను ఆదుకోవాలని కొంతకాలంగా వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వీరి డిమాండ్ ను సీఎం జగన్ సానుకూలంగా పరిష్కరించారు.
ఈహెచ్ఎస్ ప్రయోజనాలివే !
ఈహెచ్ఎస్ (ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్) పరిధిలోకి రావడం వల్ల సచివాలయ ఉద్యోగులకు ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వైద్య చికిత్సలు అందుతాయి. ఇందులో క్యాష్ లెస్, రీయింబర్స్ మెంట్ కూడా ఉన్నాయి. ప్రభుత్వం జారీ చేసే ఈహెచ్ఎస్ హెల్త్ కార్డుల్ని వాడుకుని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందేందుకు వీరికి అవకాశం లభిస్తుంది. ఈ పథకం కింద నెలకు 300 రూపాయల చొప్పున ఉద్యోగుల ఖాతాల్లో డెబిట్ చేస్తారు. అలాగే ఉద్యోగులతో పాటు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్య ప్రయోజనం పొందుతారు.