YS Jagan: హైకోర్టులో జగన్ మరో పిటిషన్-సీఎం సెక్యూరిటీ ఇవ్వాలంటూ..!
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత తనకు భద్రత తగ్గించేశారని, తనకు ప్రాణహాని ఉన్నందున ఎన్నికల ఫలితాలకు ముందు ఉన్న భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
ఇందులో గతంలో తనపై జరిగిన కోడికత్తి దాడితో పాటు పలు అంశాల్ని ప్రస్తావించారు. దీనిపై త్వరలో హైకోర్టు విచారణ జరపనుంది.

జూన్ 3, 2024న ఉన్న స్థాయికి తన భద్రతను పునరుద్ధరించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని జగన్ హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ లో కోరారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనకు అందించిన భద్రత యొక్క ప్రాముఖ్యతను జగన్ గుర్తుచేసారు. తన పదవి యొక్క సున్నితమైన స్వభావం, ప్రస్తుత రాజకీయ పరిస్ధితుల దృష్ట్యా తన భద్రతకు ఇది చాలా కీలకమని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ఆశ్చర్యకరంగా నెల రోజుల్లోనే తన భద్రతను 59కి తగ్గించారని, అది కూడా తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే చేశారని పిటిషన్లో పేర్కొన్నారు.
సహజ న్యాయం సూత్రాలను ఉల్లంఘించి భద్రత తగ్గింపుపై తనకు ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదని జగన్ పిటిషన్ లో తెలిపారు. తన భద్రత తగ్గింపుకు చట్టబద్దంగా సమర్ధించుకునే అవకాశం కూడా లేదన్నారు. జడ్ ప్లస్ గా ఉన్న తన భద్రత తగ్గించడంతో పాటు భద్రతా సిబ్బంది సంఖ్యను కూడా భారీగా తగ్గించేసారని ఆరోపించారు. ప్రస్తుతం తనకు అన్ని వేళలా కేవలం ఇద్దరు భద్రతాధికారులు మాత్రమే ఉన్నట్లు జగన్ తెలిపారు. గతంలో తనకు 139 మంది భద్రతా సిబ్బంది ఉండగా.. దాన్ని 59కి కుదించారని, దీన్ని పునరుద్ధరించాలని జగన్ తన పిటిషన్ లో కోరారు.












Click it and Unblock the Notifications